ప్రతిపక్షం… ప్రజాధిక్కారం…!

ప్రజా తీర్పును అవహేళన చేస్తున్న కేసీఆర్, జగన్
– సీఎం కుర్చీ నుంచి దింపినందుకు అసెంబ్లీకి రానంటున్న మాజీ సీఎంలు
– అలాంటప్పుడు సభ్యులుగా కొనసాగడం అవసరమా?
– ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండంటున్న ప్రజలు
– ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించకుంటే మీరెందుకు?
– అసెంబ్లీకి రాకుండానే లక్షల వేతనాలు దండగ అంటూ విసుర్లు
– సోషల్ మీడియా, ట్విట్టర్ పోస్టింగులకే పరిమితమా?

సహనం వందే, హైదరాబాద్/అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారం చేతిలో ఉన్నప్పుడు సభలో సింహాసనంపై కూర్చున్న ఈ నాయకులు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ సభకు దూరంగా ఉంటున్నారు. ప్రజలు మాత్రం, “అధికారం లేకపోతే అసెంబ్లీకి రావడం మానేస్తారా? ఇదేం రాజకీయ రాగం?” అంటూ నవ్వుకుంటున్నారు.

ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే రాకూడదా?
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం వెనుక ప్రతిపక్ష హోదా సమస్యను కారణంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు సాధించడంతో, అసెంబ్లీలో 10 శాతం సీట్లు (175 సీట్లలో 18) లేనందున ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అధికార ఎన్డీఏ కూటమి వాదిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ సభకు రాకపోవడాన్ని “ప్రజాతీర్పును గౌరవించకపోవడం”గా విమర్శకులు చెబుతున్నారు. “పది శాతం సీట్లు లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించరు కదా, అందుకే సభలో కూర్చోవడం ఎందుకు?” అని జగన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే సభకు రాకపోతే ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకోవడం సరైందేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్…
తెలంగాణలో బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో 39 సీట్లతో ప్రతిపక్ష హోదా పొందినప్పటికీ, కేసీఆర్ ఎన్నికల తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే సభలో కనిపించారు. “అధికారం లేకపోతే సభలో కూర్చుని సీఎం రేవంత్ రెడ్డిని చూడటం జీర్ణం కాదు కదా” అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ విశ్లేషకుడు “కేసీఆర్‌ కు అసెంబ్లీ అంటే ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో కూర్చుని టీవీలో చూసే సీరియల్‌లా కనిపిస్తోందేమో. కానీ జీతం మాత్రం రెగ్యులర్‌గా వస్తుంది కదా, అది చాలు!” అని మండిపడ్డారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ అధికారం లేనప్పుడు సభను పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యంలో ఓ కొత్త ట్రెండ్‌గా మారిందని కొందరు వ్యంగ్యంగా చెబుతున్నారు.

అధికారం లేని జీవనశైలితో నిరాశ…
రాజకీయ విశ్లేషకుల్లో ఒక వర్గం ఈ గైర్హాజరీని “ప్రతిపక్ష బాధ్యతను విస్మరించడం”గా చూస్తోంది. “సభలో ఉంటే ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టొచ్చు, విధానాలను ప్రశ్నించొచ్చు. కానీ, ఇప్పుడు ఈ నాయకులు ఇంట్లో కూర్చుని ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలనుకుంటున్నారు” అని ఓ సీనియర్ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. “అధికారం ఉన్నప్పుడు సభలో గంటల తరబడి ప్రసంగాలు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే సైలెన్స్‌… ఇదేం రాజకీయం?” అని ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు ఈ ట్రెండ్‌ను “అధికార హ్యాంగోవర్”గా అభివర్ణిస్తూ, “ఇద్దరూ అధికారం లేని జీవన శైలిని జీర్ణించుకోలేకపోతున్నార”ని సెటైర్ వేశారు. మొత్తంగా జగన్, కేసీఆర్‌ల ఈ సైలెంట్ స్ట్రైక్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష బాధ్యతపై చర్చను రేకెత్తిస్తోంది. “సభకు రాకపోతే ప్రజాధనం వృథా అవుతుంది” అని ఒక వైపు విమర్శలు, “ఇది వారి రాజకీయ వ్యూహంలో భాగం” అని మరోవైపు వాదనలు. రాజకీయ విశ్లేషకులు మాత్రం సెటైర్‌తో కొట్టిపారేస్తున్నారు, “అసెంబ్లీలో కూర్చోకపోతేనేం? జీతం వస్తుంది. ఆ తర్వాత ప్రజలు మర్చిపోతారు. రాజకీయం కొత్త ట్విస్ట్‌తో మళ్లీ వస్తుంది. ఈ ప్రభుత్వాలపై వ్యతిరేకత వస్తే ప్రజలకు గత్యంతరం లేక తమనే ఎన్నుకుంటారన్న ధీమా వాళ్లది!”

గతంలో పలు రాష్ట్రాల్లోనూ…
ఇలాంటి పరిస్థితి గతంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కనిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989లో ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కొంతకాలం సభకు హాజరు కాలేదు. అధికారం కోల్పోయిన షాక్‌లో ఆయన సభాముఖం చూడలేదని అప్పట్లో చర్చ జరిగింది. అయితే 1994లో మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు ఎన్టీఆర్ ప్రతిపక్షంగా క్రియాశీలంగా వ్యవహరించారు. ఇదే విధంగా, తమిళనాడులో 2011లో డీఎంకే అధినేత కరుణానిధి అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ, ఆయన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా సభలో చురుకుగా పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే, 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు కొందరు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సైతం ఓటమి తర్వాత కొంతకాలం పార్లమెంట్‌కు హాజరు కాలేదు. ఈ సందర్భాలన్నీ రాజకీయ నాయకులు అధికారం కోల్పోయినప్పుడు సభలో పాల్గొనడానికి నామోషిగా ఫీలవుతున్నారు. చారిత్రకంగా చూస్తే ప్రతిపక్ష నాయకులు సభకు హాజరైనా, బహిష్కరించినా వారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి విభిన్న మార్గాలు అనుసరించారు. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ 1998లో తృణమూల్ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత ప్రతిపక్షంగా సభలో చురుకుగా పాల్గొని, తర్వాత అధికారంలోకి వచ్చారు. ఇలాంటి ఉదాహరణలు జగన్, కేసీఆర్‌లకు పాఠంగా నిలుస్తాయా అనేది కాలమే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఇద్దరి నిర్ణయం వల్ల రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్ష గొంతు బలహీనంగా మారిందని, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు సవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *