సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. ఈ బడ్జెట్ను ఆయన తీపి, చేదు కలగలిపిన ఉగాది పచ్చడిలా అభివర్ణించారు. ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం సాహసోపేతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని కూనంనేని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, హామీల అమలులో సమతుల్యత పాటించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన తెలిపారు. గొప్పలకు పోకుండా, పన్నుల భారం పెంచకుండా, ఉన్నంతలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఆయన అభినందించారు.
అయితే, రాష్ట్రం భారీ రుణభారంలో ఉండడం ఆందోళన కలిగిస్తోందని కూనంనేని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుంటే రాష్ట్రాన్ని నడపడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తోందని ఆయన ఆరోపించారు. నీటిపారుదల రంగానికి కేటాయించిన నిధులు సరిపోవని, కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణానికి మరింత ఎక్కువ నిధులు అవసరమని కూనంనేని అన్నారు. అలాగే, విద్యా, వైద్య రంగానికి కేటాయింపులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు పని భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని కూనంనేని కోరారు. ప్రభుత్వం అన్ని వర్గాల ఆర్థిక, ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మొత్తం మీద, ఈ బడ్జెట్ ఉన్నంతలో మంచిదని, ఈ పరిస్థితుల్లో ఇంతకంటే సాధ్యం కాదని కూనంనేని అభిప్రాయపడ్డారు.