సహనం వందే, హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3 లక్షల 4 వేల 965 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2 లక్షల 26 వేల 982 కోట్లు కాగా, మూలధన వ్యయం 36 వేల 504 కోట్లుగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా రైతు భరోసా పథకానికి 18 వేల కోట్లు, చేయూత పథకానికి 14 వేల 861 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 600 కోట్ల రూపాయలు కేటాయించారు.
వ్యవసాయ రంగానికి 24 వేల 439 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక రంగానికి 1674 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే, విద్యా రంగానికి 23 వేల 108 కోట్ల రూపాయలు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 31 వేల 605 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనున్నారు. అలాగే, మహిళా మరియు శిశు సంక్షేమ రంగానికి 2 వేల 862 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ బడ్జెట్పై విమర్శలు చేస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని, ఆచరణలో సాధ్యం కాదని వారు అంటున్నారు.