కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలు

  • నవంబర్ 9 నాటికి అన్ని జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు
  • కేబినెట్ లో కీలక నిర్ణయం… విజన్ 2047కు ఆమోదం

సహనం వందే, హైదరాబాద్:
వచ్చే నవంబర్ 9వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

  • రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కు ఆమోదం: చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కి.మీ. పొడవున్న రీజినల్ రింగ్ రోడ్డుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు దోహదపడుతుంది.
  • గోదావరి జలాలపై రాజీ లేదు: గోదావరి నదీ జలాల హక్కుల విషయంలో తెలంగాణ చుక్క నీరు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని మంత్రిమండలి స్పష్టం చేసింది. గోదావరి జలాలు, అలాగే బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి చట్ట, న్యాయ పరమైన పోరాటం కొనసాగించాలని నిర్ణయించింది. బనకచర్లను అడ్డుకునే విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు చేసిన వాదనల వివరాలను జూలై మొదటి వారంలో ప్రజాప్రతినిధులందరికీ వివరించాలని ఆదేశించింది.
  • విభజన చట్టం పెండింగ్ అంశాలు: విభజన చట్టంలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న అంశాలపై సత్వరం ఉన్నతస్థాయి కమిటీలో చర్చించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానించారు.
  • కాళేశ్వరంపై విచారణకు పూర్తి సహకారం: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ కోరిన మేరకు నిర్దేశించిన గడువులోగా పూర్తి వివరాలను అందజేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
  • నూతన క్రీడా విధానం: 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వివిధ ప్రోత్సాహకాలతో రూపొందించిన స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం లభించింది.
  • విజన్ 2047: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో రూపొందించిన విజన్ 2047కు ఆమోదం తెలిపింది.
  • క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధి: రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధి పరచాలని సంకల్పించిన నేపథ్యంలో ప్రముఖ ఆంకాలజిస్ట్ పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడానికి ఆమోదం తెలిపారు.
  • నూతన మున్సిపాలిటీలు: సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జన్నారంలను మున్సిపాలిటీలుగా, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్‌గ్రేడేషన్‌కు ఆమోదం లభించింది.
  • ఉన్నత విద్యా విస్తరణ: శాతవాహన యూనివర్సిటీలో 60 సీట్ల చొప్పున ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల ప్రారంభానికి, మహబూబ్‌నగర్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఐఐఐటికి శ్రీకారం చుట్టడానికి, హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు ఆమోదం లభించింది.
  • ప్రతి త్రైమాసిక సమీక్ష: మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై ఇకనుంచి ప్రతి త్రైమాసికంలో ఒకసారి సమీక్షించాలని తీర్మానం చేశారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
రైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మంత్రివర్గ సభ్యులు రైతుల పక్షాన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *