- ఆ రెండు రోజులు టెన్షన్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- శాఖల మార్పు అంటూ సిగ్నల్ ఇచ్చి వారిని నియంత్రణలోకి తెచ్చుకున్న సీఎం
- కొత్తవారికి శాఖల కేటాయింపులో జాప్యం వెనుక వ్యూహం అదే
- విస్తరణ మరుసటి రోజు ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి
- దీంతో ఆయా శాఖల్లో మంత్రులపైనున్న వ్యతిరేకతను పసిగట్టిన సీఎం
- చివరకు తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయింపు
సహనం వందే, హైదరాబాద్:
మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్గా ఉంచారు. దీంతో పాత మంత్రులు ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. రాజకీయ ఉద్దండులైన అనేక సీనియర్ మంత్రులను కూడా జూనియర్ నాయకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోల్తా కొట్టించడం విశేషం. అసలు శాఖల మార్పు విషయం హైకమాండ్ కి ఏమైనా సంబంధం ఉందా? ఢిల్లీ వెళ్లి ఎవరికి ఏ శాఖ ఇస్తారని అగ్ర నాయకత్వం వద్ద ముఖ్యమంత్రి చర్చిస్తున్నారని జరిగిన ప్రచారాన్ని ఉద్దండ నాయకులు కూడా నమ్మడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయంలో రెండు రోజులు మైండ్ గేమ్ ఆడి మంత్రుల పట్ల ప్రజల ఆలోచనా విధానాన్ని ముఖ్యమంత్రి గుర్తించారు.
విభిన్న రాజకీయ శైలి…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ శైలి ప్రత్యేకమైనది. రాజకీయాల్లో తలపండిన వారికి కూడా ఆయన వ్యూహాలు అంతుచిక్కవు. అందరూ ఒక అంశంపై దృష్టి పెడితే, రేవంత్ ఆలోచన భవిష్యత్తుపై ఉంటుంది. అందుకే ఆయనను తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ మంత్ర అని పిలుస్తారు. కాకలు తీరిన కేసీఆర్ను కూడా తొడగొట్టి గద్దె దించిన నేతగా రేవంత్ పేరు సంపాదించారు. రేవంత్ రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి ఏదైనా విషయం జరిగిన తర్వాత రెండు మూడు రోజులు పడుతుంది. సరిగ్గా ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత అదే జరిగింది.
మంత్రివర్గ విస్తరణ తర్వాత ఢిల్లీ పయనం…
అనూహ్యంగా ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. అయితే విస్తరణ పూర్తయిన మరుసటి రోజే రేవంత్ రెడ్డి ఢిల్లీ విమానం ఎక్కారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే కాగితంపై సంతకం పెట్టకుండానే ఆయన ఢిల్లీకి బయలుదేరారు. దీంతో అటు రాజకీయ వర్గాలను, కాంగ్రెస్ పార్టీ వర్గాలను, కొత్త-పాత మంత్రులను, రాష్ట్ర ప్రజలను ఒకరకమైన ఉత్కంఠలో ఉంచారు. హస్తినలో తాను చేయాల్సిన పని పూర్తి చేసుకుని రేవంత్ హైదరాబాద్ తిరిగి వచ్చారు. మంత్రుల శాఖల కేటాయింపుకు తన ఢిల్లీ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎస్ను పిలిపించి కొత్త మంత్రులకు శాఖలు కేటాయించి, వాటిని అధికారికంగా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది, అయితే ఇక్కడే రేవంత్ అసలు వ్యూహం, ఆయన రాజకీయ చతురతకు అద్దం పట్టే వ్యవహారం దాగి ఉంది.
ఢిల్లీ వెనుక ఉన్న ఎత్తుగడ…
రేవంత్ ఢిల్లీ వెళ్లడానికి ముందు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించి సంతకం పెట్టి వెళ్లిపోతే ఎటువంటి సమస్య ఉండేది కాదు. అది ఆయనకు పెద్ద పనేమీ కాదు. కానీ కావాలనే కొత్త మంత్రులకు శాఖలు కేటాయించకుండా ఢిల్లీ వెళ్లిన రేవంత్, అప్పటికే ఉన్న మంత్రులకు కూడా ఒక షాకిచ్చారు. ఆయన ఢిల్లీ విమానం ఎక్కగానే, ఇక్కడ సోషల్ మీడియాలో మంత్రివర్గ ప్రక్షాళన అంటూ ఊహాగానాలు షికారు చేశాయి. ఆ మంత్రి శాఖ మారింది, ఈ మంత్రి శాఖ మారింది అంటూ ప్రచారం ఊపందుకుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక శాఖపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, ఆయన నుంచి ఆర్థిక శాఖను తొలగిస్తారని ఒకవైపు… మరో కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌర సరఫరాల శాఖ బాధ్యతల నుంచి తప్పిస్తారని ఇంకోవైపు… ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ మంత్రిత్వ శాఖలు మారుతాయని మరొకవైపు… ఒకరు కాదు, మరో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వస్తారని నాల్గవ వైపు – ఇలా నిరంతర ప్రచారం జరిగింది. కానీ ఇవేవీ జరగలేదు.
మంత్రివర్గ ప్రక్షాళనకు మార్గం సుగమం?
మంత్రివర్గ ప్రక్షాళన అనే మందు పాతర పేల్చడానికి రేవంత్ పన్నిన పన్నాగమేనా? తాజాగా వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా రేవంత్ ఎప్పుడైనా మంత్రుల శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందా? అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. రాష్ట్రం దృష్టిని అంతా ఒకవైపు మళ్లించేందుకే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఎటువంటి ప్రకటన చేయకుండా రేవంత్ ఢిల్లీ వెళ్లారని, అధిష్టానం పెద్దలతో వారికి అవసరమైన ముచ్చట్లు చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత తనకు నచ్చిన పని చేసి ముగించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయ మలుపులు తిప్పుతారో వేచి చూడాలి.