వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రస్తుత వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు మంగళవారం వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముందస్తు చర్యలు, నాలాల పూడికతీత…
వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి…
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రాంతంలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. డిసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *