- గతేడాది కంటే వారం రోజుల ముందే రాక
- ప్రస్తుతం అత్యంత చురుకుగా కదలికలు
- మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు
సహనం వందే, హైదరాబాద్:
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గతేడాది జూన్ 3వ తేదీన రాష్ట్రంలోని రుతుపవనాలు ప్రవేశించగా… ఈసారి వారం రోజుల ముందే రాష్ట్రాన్ని తాకాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ఆగమనం ఉంటుంది. కానీ ఈ ఏడాది వానాకాలం సీజన్లో ముందస్తుగా రుతుపవనాల రాక రైతాంగాన్ని ఉత్సాహంలో నింపింది. వారం రోజులుగా కురుస్తున్న అడపాదడపా వర్షాలతో రైతులంతా దుక్కులు దున్ని సాగుపనులకు సిద్దంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రుతుపవనాలు ముందుగానే రావడంతో వ్యవసాయ పనులను కూడా ముందస్తుగానే ప్రారంభించేందుకు సంతోషంగా సన్నద్దమవుతున్నారు.
ఈసారి భారీ వర్షపాతం…
నైరుతి సీజన్లో రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 73.86 సెంటీమీటర్లు. నాలుగు నెలల కాలంలో ఈమేరకు వర్షాలు కురిస్తే కరువు లేనట్లే. గతేడాది నైరుతి సీజన్లో 96.26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 30శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 2023 ఏడాది నైరుతి సీజన్లో 86.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 18శాతం అధిక వర్షాలు కురిసినప్పటికీ… కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో కరువు ఛాయలు కనిపించాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం 10 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నప్పటికీ… గతేడాది కంటే అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఉత్తర, దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం…
దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన మరుసటి రోజే ఉత్తర, దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం గమనార్హం. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటనలో వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.