- పవన్ కల్యాణ్కు రిటర్న్ గిఫ్ట్ వివాదం
- టాలీవుడ్లో కుట్రలు… ఫ్యాన్స్ రచ్చ
సహనం వందే, అమరావతి:
తెలుగు సినిమా పరిశ్రమపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ గౌరవం, మర్యాదలను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే, వారు మాత్రం నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. ఈ రిటర్న్ గిఫ్ట్ను (థియేటర్ల బంద్) స్వీకరిస్తానని ఆయన హెచ్చరించారు. టాలీవుడ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనీస గౌరవం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా సినీ పెద్దలు కనీసం ముఖ్యమంత్రిని కలవలేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలో అలజడి నెలకొంది. ఆయన రాబోయే చిత్రం హరిహర వీరమల్లు చుట్టూ అల్లుకున్న కుట్రలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
థియేటర్ల బంద్ డ్రామా…
హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న కీలక సమయంలో థియేటర్ల బంద్ ప్రకటన టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు కొందరు బడా నిర్మాతలు కుట్ర పన్నినట్లు పవన్ అభిమానులు ఆరోపించారు. కోవిడ్-19, రాజకీయ బాధ్యతలు, వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైనా, ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి కీలక సమయంలో థియేటర్ల బంద్ ప్రకటన అనుమానాలకు దారితీసింది. చివరకు నిర్మాతల మండలి చర్చలు జరిపి థియేటర్ల మూసివేత ఉండదని, సినిమాలు యథావిధిగా ఆడతాయని ప్రకటించింది. నిర్మాతల మండలి ప్రకటన వెలువడిన కొద్ది క్షణాల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాలుగు బడా నిర్మాణ సంస్థలపై సందేహాలు
టాలీవుడ్లో కొన్ని రోజులుగా నాలుగు బడా నిర్మాణ సంస్థలు హరిహర వీరమల్లు సినిమాపై కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే ఆ నలుగురు నిర్మాతల పేర్లు అధికారికంగా బయటకు రానప్పటికీ సినీ వర్గాల్లో పలు ఊహాగానాలున్నాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. థియేటర్ల బంద్కు పిలుపునిచ్చిన వారి వెనుక ఎలాంటి శక్తులు ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ విచారణ జరుగుతుంది.