‘అగ్ల్రీ’ చైర్మన్లు… డమ్మీ ఎండీలు

  • వ్యవసాయ కార్పొరేషన్లలో చైర్మన్ల హవా
  • వారికి కొందరు ఐఏఎస్ ల ఎండీల గులాంగిరీ
  • ఎండీల అధికారాలను హైజాక్ చేసి ఆధిపత్యం
  • మంత్రి తుమ్మల కూడా ఏమీ చేయలేరా?
  • సీఎం ఆరా… కొందరు చైర్మన్లపై గుర్రు…
  • అలాంటి వారికి తదుపరి కొనసాగింపు లేనట్టే!

తెలంగాణ వ్యవసాయ శాఖలోని కార్పొరేషన్లు ఇప్పుడు చైర్మన్ల సొంత జాగీర్లుగా మారిపోయాయి. కొందరు చైర్మన్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఐఏఎస్ అధికారులుగా ఉన్న ఎండీలు సైతం వారి గుప్పిట్లో డమ్మీలుగా మిగిలిపోయారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న చైర్మన్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎండీలు గులాంలు.. చైర్మన్లదే పెత్తనం!

వ్యవసాయశాఖలో ఆగ్రోస్, ఆయిల్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, హాకా, టెస్కాబ్, మార్క్‌ఫెడ్ వంటి కీలకమైన కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని చైర్మన్ల అరాచక పాలనలో చిక్కుకున్నాయి. ఐఏఎస్, గ్రూప్-1 స్థాయి అధికారులైన ఎండీలు, రాజకీయంగా కేవలం నియోజకవర్గ స్థాయి మాత్రమే ఉన్న చైర్మన్ల ఆదేశాలకు తలొగ్గి గులాంగిరీ చేస్తున్నారు.

కొందరు ఐఏఎస్ అధికారులు సైతం చైర్మన్లకు తొత్తులుగా మారిపోయారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండీలు చేయాల్సిన పాలనాపరమైన పనులను చైర్మన్లే హైజాక్ చేసి, తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు.

నచ్చని ఉద్యోగులపై వేటు!
ఓ కీలక కార్పొరేషన్ చైర్మన్ జులుం మామూలుగా ఉండదు. ఎండీని పూర్తిగా పక్కనపెట్టి ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నాడు. తనకు నచ్చని ఉద్యోగులను నిత్యం బెదిరిస్తూ, అవసరమైతే బదిలీలు చేయిస్తున్నాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉసురు తీస్తున్నాడు. అత్యంత కీలకమైన ఒక మంత్రి తన వెనుక ఉన్నాడని చెప్పుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఐఏఎస్ అధికారిగా ఉండి కూడా ఆ కార్పొరేషన్ ఎండీ… చైర్మన్ ఆగడాలను అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఐఏఎస్ అధికారులు తప్పులను నిర్మొహమాటంగా చెప్పేవారు. కానీ నేడు ఒక చిన్నపాటి చైర్మన్ ముందు కూడా ఐఏఎస్ స్థాయి ఎండీలు చేతులు కట్టుకుని నిలబడటం విడ్డూరంగా ఉంది. వారిని చూస్తే ఐఏఎస్ అనే పవర్ ఫుల్ ఉద్యోగం పట్ల కూడా గౌరవం పోతుంది.

వసూళ్ల దందా.. టెండర్లలో భారీ అవినీతి!
కార్పొరేషన్ల నిధులను చైర్మన్లు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. కంపెనీల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. టెండర్ల ప్రక్రియలో భారీగా అవినీతి జరుగుతోందని ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. మరో కార్పొరేషన్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆర్థికంగా ఆ సంస్థ కుదేలవుతున్నా, చైర్మన్ మాత్రం తన దందా ఆపడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే దిక్కులేని స్థితిలోనూ, ఆయన తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ సంస్థను మరింత దిగజారుస్తున్నారు. ఎండీ అధికారాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని నియంతలా ప్రవర్తిస్తున్నాడు.

ఎండీలపై వేధింపులు.. తప్పుడు ఆరోపణలు!
మరో కార్పొరేషన్ చైర్మన్ అయితే నిత్యం ఎండీని వేధింపులకు గురిచేస్తున్నాడు. సంస్థ పరువు కాపాడాల్సిన చైర్మన్, ఆ కార్పొరేషన్‌పై లేనిపోని ఆరోపణలు సృష్టించి ఎండీని టార్గెట్ చేస్తున్నాడు. బోర్డు తీసుకున్న నిర్ణయాలను సైతం పట్టించుకోకుండా తన సొంత నిర్ణయాలను అమలు చేస్తున్నాడు. దీంతో ఆ ఎండీ పూర్తిగా నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. మిగిలిన కార్పొరేషన్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. చైర్మన్ల స్థాయి కేవలం నియోజకవర్గ స్థాయి నాయకుడి కంటే తక్కువేనని ఎండీలు విస్మరిస్తున్నారని అంటున్నారు. కేవలం ఎండీ పదవి కోసం వారు గులాంగిరి చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఎండీల భయమే చైర్మన్ల ధైర్యం. లేకుంటే రోజువారి పరిపాలన వ్యవహారాల్లో చైర్మన్ల జోక్యం ఎందుకు? ఉద్యోగులను బెదిరించడం ఏంటి? తమకు నచ్చకపోతే బదిలీ చేస్తారా? తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తారా? కంపెనీలతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారా?

మహిళా ఉద్యోగులకు వేధింపులు…
ఇక ఈ చైర్మన్లలో ఒకరిది వికృతమైన చేష్ట. మహిళా ఉద్యోగులతో ఎలా మసలుకోవాలో కూడా ఆయనకు తెలియకపోవటం విడ్డూరం. తనకు నచ్చకపోతే వాళ్లను కామెంట్ చేస్తాడు. అవసరమైతే వాళ్లకు వార్నింగ్ ఇస్తాడు. వారు దారిలోకి వస్తే సరే సరి… లేదంటే వాళ్ల మీద వేటు వేస్తాడు. ఐదు నెలల కిందట ఒక ఉద్యోగిని ఇలాగే తొలగించి పాపం మూటగట్టుకున్నాడు. విచిత్రం ఏంటంటే వ్యవసాయ శాఖలో ఒక కీలకమైన అధికారి కూడా ఈయనకు సపోర్ట్ ఇవ్వడం పరాకాష్ట. అంతే కాదు ఆ కార్పొరేషన్లో మహిళా ఉద్యోగులతో ఒక్కోసారి రాత్రి 9-10 గంటల వరకు పని చేయించాల్సిన అవసరం ఏంటి అని వారి కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు.

క్రీడల పేరుతో ‘సీఎస్ఆర్’ దుర్వినియోగం!
ఉదాహరణకు ఒక చైర్మన్ తన జిల్లాలో ఒక క్రీడల పోటీ కోసం ఆ కార్పొరేషన్ నుండి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద నిధులు మంజూరు చేయించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ కార్పొరేషన్లకు సీఎస్ఆర్ కింద నిధులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఎండీలకు తెలియదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా అది వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు అయితే కొంతవరకు సమర్థించవచ్చు. కానీ పిల్లల క్రీడలకు ఇవ్వడం చైర్మన్ల ఇష్టారాజ్యానికి పరాకాష్ట. ఈ పరిస్థితి మారకపోతే వ్యవసాయ కార్పొరేషన్లు మరింత దిగజారే ప్రమాదం ఉందని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యవసాయ శాఖలోని కొన్ని కార్పొరేషన్ల చైర్మన్ల తీరుపై ఆరా తీసినట్లు తెలిసింది. వారి పదవీకాలం ముగిసిన తర్వాత తదుపరి కొనసాగింపు లేకుండా చేయాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.

మంత్రి తుమ్మల నిస్సహాయత…
ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక కార్పొరేషన్‌లో ఒక మేనేజర్ స్థాయి ఉద్యోగిని చైర్మన్ అకారణంగా సస్పెండ్ చేస్తే, ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని మంత్రి ఎండీకి చెప్పినా, చైర్మన్ మాత్రం మంత్రి మాటను సైతం పెడచెవిన పెడుతున్నాడు. దీంతో మంత్రి పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా తయారైంది. వ్యవసాయ శాఖలోని కార్పొరేషన్లకు తాము సామంత రాజులమని, అందులోని ప్రజా సొమ్మును అక్రమంగా తినడానికి తమకు హక్కు ఉందని చైర్మన్లు భావిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *