- కాంగ్రెస్ లో భగ్గుమన్న అంతర్గత విభేదాలు
- పదవుల పంపకంపై రచ్చ రచ్చ!
- వ్యక్తిగత విమర్శల దాకా దిగిన ఇరు వర్గాలు!
- ఢిల్లీ పెద్దలకు చేరిన ఫిర్యాదులు…
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు మధ్య పదవుల పంపకంపై మొదలైన వివాదం వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. గాంధీభవన్ వేదికగా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పార్టీ కోసం కష్టపడిన మహిళా కార్యకర్తలకు పీసీసీ కార్యవర్గంలో తగిన ప్రాధాన్యం కల్పించాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆమె పట్టుదలతో ఉండటంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
జిల్లాల నుంచి ఒత్తిడి ఉంది…
అన్ని జిల్లాల నుంచి తనపై ఒత్తిడి ఉందని, పీసీసీ కార్యవర్గంలో మహిళా వింగ్ నుంచి నాయకులను ఎంపిక చేయాల్సిందేనని సునీత రావు స్పష్టం చేశారు. ఈ అంశంపై రెండు రోజుల క్రితం ఆమె అనుచరులు గాంధీభవన్లో ధర్నాకు దిగడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. మహిళా వింగ్లో పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్’ సిద్ధాంతాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు. అయితే గాంధీభవన్లో ధర్నా చేయడం సరికాదని పీసీసీ తప్పుబట్టింది. సీనియర్ నాయకుడు కుమార్రావుతో ఫిర్యాదు కూడా చేయించింది. మహేష్ కుమార్ గౌడ్కు మద్దతుగా గౌడ సంఘం కూడా ప్రెస్ మీట్ పెట్టి మహిళా సంఘం నాయకులను తప్పుబట్టడం గమనార్హం. పదవుల కోసం మొదలైన ఈ ఫైట్ వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.
ప్రజాప్రతినిధులకు పదవులెందుకు?
పీసీసీ కార్యవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదని సునీతారావు నిప్పులు చెరిగారు. ప్రజలు వారిని ప్రత్యేక బాధ్యతలతో గెలిపించారని, ఆయా నియోజకవర్గాల్లో ప్రజాసేవ, అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తే సరిపోతుందని ఆమె అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవులు లేనివారికి పార్టీలో అవకాశం ఇస్తే పార్టీ పటిష్ఠతకు పూర్తిస్థాయిలో కృషి చేసే అవకాశం ఉంటుందని ఆమె బలంగా వాదిస్తున్నారు. పార్టీ ఈ దిశగా ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ నాయకులకు కూడా చెబుతానని ఆమె తేల్చి చెప్పారు. ఇక ప్రస్తుతం పీసీసీ కార్యవర్గంలో నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఖాళీగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందులో కనీసం ఒక మహిళకు అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ సిద్ధాంతాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీనే పాటించకపోతే ఎలా అని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంతర్గత పోరు పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి విభేదాలు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపుతాయని అంటున్నారు. ఢిల్లీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతారో వేచి చూడాలి.