- ట్రంప్ కు ఖతార్ బహుమతిగా ఎయిర్ ఫోర్స్ వన్!
- విలాసవంతమైన విమానం… రక్షణ వ్యవస్థల సంగతేంటి?
- మార్పులకు భారీ ఖర్చు… గూఢచర్యం భయం!
సహనం వందే, వాషింగ్టన్:
అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఇకపై ఖతార్ రాజకుటుంబం ఇచ్చిన ఖరీదైన బహుమతితో ఆకాశంలో విహరించనుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ప్రయాణించే ఈ ‘ఆకాశంలో రాజభవనం’ భద్రత విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
400 మిలియన్ డాలర్ల విలాసం!
ఖతార్ రాజకుటుంబం దాదాపు 400 మిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక బోయింగ్ 747-8 విమానాన్ని అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రస్తుతం 35 ఏళ్ల నాటి ఎయిర్ ఫోర్స్ వన్ను ఉపయోగిస్తున్నారు. దాని స్థానంలో ఈ కొత్త విమానం సేవలు అందించనుంది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఇప్పటివరకు ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్లో అధ్యక్షుడు, ఆయన సిబ్బంది భద్రత కోసం అనేక అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ప్రత్యేక కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఖతార్ గిఫ్ట్గా వస్తున్న విమానం మాత్రం అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్తో ఒక ‘ఎగిరే రాజభవనం’లా ఉంది. ఇందులో అధ్యక్షుడి భద్రతకు కావాల్సిన కీలకమైన వ్యవస్థలు లేవని తెలుస్తోంది.
రక్షణ వ్యవస్థల కోసం రెండేళ్లు.. వందల కోట్లు
ఈ విమానాన్ని నేరుగా ఎయిర్ ఫోర్స్ వన్గా ఉపయోగించడం అసాధ్యం. దీనికి అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది. లోపలి భాగాలను పూర్తిగా మార్చి, గూఢచర్య పరికరాలు ఏమైనా ఉన్నాయా అని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఆ తర్వాత అత్యంత సురక్షితమైన సమాచార వ్యవస్థలు, అత్యాధునిక రక్షణ సాంకేతికతలను అమర్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు దీని కోసం వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు. మరోవైపు ఒక విదేశీ ప్రభుత్వం ఇచ్చిన విమానాన్ని ఉపయోగించడం వల్ల భద్రతాపరమైన రిస్క్లు కూడా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.