పాకిస్తాన్ చీలిక

  • ప్రత్యేక దేశంగా బలూచిస్తాన్
  • స్వాతంత్ర్య ప్రకటన… భారత్ మద్దతు?
  • ఒకప్పుడు ప్రత్యేక దేశమే…!

పాకిస్తాన్‌కు తలనొప్పిగా మారిన బలూచిస్తాన్ ప్రాంతం ఒక్కసారిగా స్వాతంత్య్రం ప్రకటించడంతో అంతర్జాతీయంగా కలకలం రేగింది. ప్రముఖ బలూచ్ ఉద్యమకారుడు మీర్ యార్ బలూచ్ ఈ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు తమ కొత్త దేశానికి భారతదేశం, ఐక్యరాజ్య సమితి (ఐరాస) మద్దతు కూడా కోరారు. ఈ పరిణామంతో సోషల్ మీడియా వేదికగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ట్రెండింగ్‌లోకి రాగా, బలూచిస్తాన్ జెండాలు పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో ఈ తాజా పరిణామం దక్షిణాసియా రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకప్పుడు ప్రత్యేక దేశమే…
1947లో బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా కొంత కాలం ఉండేది. 1948లో పాకిస్తాన్ సైనిక చర్యల ద్వారా ఈ ప్రాంతాన్ని ఆక్రమించి బలవంతంగా తమ దేశంలో విలీనం చేసుకుంది. ఈ చర్యను బలూచ్ ప్రజలు చట్టవిరుద్ధంగా భావిస్తారు. బలూచ్ నాయకులు, ప్రజలు అప్పటినుంచి స్వతంత్ర దేశం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.

రాజకీయ అణచివేత…
పాకిస్తాన్‌లో బలూచ్ ప్రజలు తమను రాజకీయంగా అణచివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి రాజకీయ నాయకులు, కార్యకర్తలు తరచూ అదృశ్యం కావడం లేదా హింసకు గురవడం వంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. క్వెట్టా వంటి నగరాల్లో పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించడం, చిన్న రాజకీయ ప్రదర్శనలను కూడా అణచివేయడం వల్ల స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది.

ఆర్థిక దోపిడీ…
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్. ఇది 44% భూభాగాన్ని కలిగి ఉంది. గ్యాస్, ఖనిజాలు, తీరప్రాంత వనరులతో సమృద్ధిగా ఉంది. అయితే ఈ వనరులు పాకిస్తాన్ దోచుకుంటుందని, స్థానిక బలూచ్ ప్రజలకు ఎటువంటి లాభం చేకూరడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతం తీవ్ర పేదరికంలో ఉంది. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందని స్థితిలో ఉన్నాయి.

సాంస్కృతిక, జాతి వివక్ష…
బలూచ్ ప్రజలు తమను పాకిస్తాన్‌లో ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తున్నారు. వారి భాష, సంస్కృతి, గుర్తింపు అణచివేతకు గురవుతున్నాయని వారు అనుకుంటున్నారు. బలూచిస్తాన్‌లో పఠాన్లు, ఇతర జాతులు పెద్ద సంఖ్యలో వలస వచ్చి స్థిరపడటం వల్ల స్థానిక బలూచ్ జాతి జనాభా తగ్గుతోందనే ఆందోళన ఉంది.

మానవ హక్కుల ఉల్లంఘనలు…
పాకిస్తాన్ సైన్యం, గూఢచార సంస్థలు స్థానికులపై హింసాత్మక చర్యలు చేపడుతున్నాయని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు ఆరోపిస్తున్నాయి. హత్యలు, అక్రమ అరెస్టులు సాధారణంగా జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *