- పదవులు ఇవ్వకపోవడంపై మండిపాటు
- ఎన్నికల్లో పనిచేసింది ఇందుకేనా అని నిలదీత
- అధికారంలోకి తెచ్చింది తామేనని స్పష్టీకరణ
సహనం వందే, హైదరాబాద్:
అధికారంలోకి రావడానికి కష్టపడ్డ మహిళా నేతలకు కాంగ్రెస్ పార్టీ మొండిచెయ్యి చూపిస్తోంది. నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అర్హుల జాబితాను పీసీసీ, ఏఐసీసీకి పంపి ఏడాదిన్నర గడుస్తున్నా ఒక్కరికి కూడా పదవి దక్కకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేకపోతే ఎలా పనిచేయాలని వారు నిలదీస్తున్నారు. 20 ఏళ్లకు పైగా పార్టీ కోసం పనిచేసినా పదవులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని మహిళా నేతలు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీసీసీతోపాటు ఏఐసీసీ పెద్దలకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోవడంతో మహిళా నేతలు సీరియస్ అవుతున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.
మహిళా నేతల నిప్పులు…
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ మహిళా వింగ్కు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో అందరిలోనూ అసంతృప్తి నెలకొందని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు తేల్చి చెప్పారు. పనిచేసిన వారికి పదవులు ఇప్పించేందుకు తాను అవిశ్రామంగా ప్రయత్నిస్తున్నానని ఆమె తెలిపారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటీవ్ బాడీ మీటింగ్లో మహిళా నేతలు నిప్పులు చెరిగారు. పదవులు ఇవ్వకపోతే ఎందుకు పనిచేయాలని వారు ప్రశ్నించారు. సునీతారావు కల్పించుకుని అందరినీ శాంతింపజేయడం గమనార్హం. ఇదే అంశంపై త్వరలో పీసీసీ, ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు సునీతారావు సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు గుర్తింపు లేదా?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మహిళా వింగ్ కీలక పాత్ర పోషించింది. గత ప్రభుత్వ వైఫల్యాలు, నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సఫలమైంది. టీమ్లుగా ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ ఓటమి కోసం అవిశ్రాంతంగా కృషి చేసింది. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అనేక మంది మహిళా నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ముందు నిలిచారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను సమష్టిగా నిర్వర్తించారు. ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సునీతారావు అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు, బంద్లు చేపట్టారు. తమ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఎంతో మంది మహిళా నేతలు ధైర్యంగా పోరాడారు. కానీ ఇప్పుడు పదవుల కేటాయింపులో వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇంటింటికీ తిరిగింది ఇందుకేనా?
గత ప్రభుత్వం చేసిన తప్పులను ఇంటింటికీ చేర్చడంలో మహిళా నేతలు అద్భుతంగా పనిచేశారు. డిక్లరేషన్లు, కరపత్రాల రూపంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుండేలా వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో, ప్రజలకు జరిగే మేలు ఏమిటో కూడా ముందే ప్రజలకు తెలియజేశారు. పార్టీలో మహిళా వింగ్ క్రియాశీలక పాత్ర పోషించిందని అగ్రనేతలు గతంలో కొనియాడారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని ప్రశంసలు కురిపించారు. కానీ ఇప్పుడు పదవులు ఇచ్చే విషయంలో మాత్రం మొండిచెయ్యి చూపించడం దారుణమని మహిళా వింగ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన తమకు గుర్తింపు లేకపోతే ఇకపై ఎలా పనిచేయాలని మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వివక్షను కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సమర్థిస్తుందో వేచి చూడాలి.