సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డికి సంఘీభావం

  • పోలీసుల సోదాలపై జర్నలిస్టుల ఖండన
  • తెలుగు రాష్ట్రాల్లో పెల్లుబుకిన నిరసనలు
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
  • ‘సైమా’ ఖండన…కక్షసాధింపు తగదని హితవు

సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రతినిధులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆ సంస్థ తీవ్రంగా ఆరోపిస్తోంది. సాక్షి మీడియా వర్గాల ప్రకారం… పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ చూపకుండానే విజయవాడలో ధనంజ‌య‌రెడ్డి ఇంట్లోకి జొరబడి, ఆయన కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. ఈ చర్య పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పలువురు విమర్శిస్తున్నారు.

కారణం లేకుండానే సోదాలు…
కొన్ని గంటలపాటు కొనసాగిన ఈ పోలీసుల సోదాల్లో ధనంజ‌య‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలకు గల కారణాలను పోలీసులు స్పష్టంగా వెల్లడించలేదని సాక్షి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను నిలదీస్తున్నందునే, ముఖ్యంగా ప్రతిపక్షాల గళాన్ని బలంగా వినిపిస్తున్నందునే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని యాజమాన్యం ఆరోపిస్తోంది. గతంలోనూ సాక్షి కార్యాలయాల్లో పలుమార్లు సోదాలు జరిగాయని, తమ ఉద్యోగులను వేధించారని వారు గుర్తు చేస్తున్నారు.

న్యాయ పోరాటానికి సన్నద్ధం…
ఈ పరిణామాల నేపథ్యంలో సాక్షి మీడియా న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతోంది. సెర్చ్ వారెంట్ లేకుండా ఒకరి ఇంట్లోకి చొరబడటం, కుటుంబ సభ్యులను బెదిరించడం పూర్తిగా చట్టవిరుద్ధమని సాక్షి న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన పట్ల ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని, ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సైమా) మండిపడింది. ఈ మేరకు సైమా అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టుల పట్ల కక్షసాధింపు తగదని వారు హితవు పలికారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *