- ఆసక్తి కలిగిన వారికి నేర్పిస్తాం
- ఆదేశంలో అవకాశాలను అందిపుచ్చుకుంటాం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
ఇటీవల జపాన్ దేశ పర్యటన సందర్భంగా తెలుసుకున్న విషయాల మేరకు ఆ దేశానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చడానికి వీలుగా తెలంగాణలో జపనీస్ భాషను నేర్పించాలని సంకల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని స్పష్టం చేశారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. బెంగుళూరు వేదికగా ది హిందూ పత్రిక శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని ఆయన సమగ్రంగా తెలియజేశారు.
అభివృద్ధిలో తెలంగాణ దూకుడు…
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రభుత్వం విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనా రంగాలపై దృష్టి సారించిందని, అందులో భాగంగా అనేక వినూత్న ప్రణాళికలకు శ్రీకారం చుట్టామని, ప్రపంచ దేశాల్లోని అగ్రగామి నగరాలతో పోటీ పడాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి తెలిపారు. నెట్ జీరో సిటీకి ప్రణాళికలు సిద్ధం చేశామని, దేశంలోనే మొట్టమొదటిదిగా ఫ్యూచర్ సిటీకి రూపకల్పన చేశామని, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రద్దు చేశామని, 360 కి.మీ మేరకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించడమే కాకుండా తెలంగాణలో ప్రాంతాల వారిగా పారిశ్రామికీకరణకు సన్నద్ధమయ్యామని ఆయన వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు లోపలి పరిధిలో పరిశ్రామిక పార్కులు, ఐటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, అటోమొబైల్ ఇండస్ట్రీ, ఇతర పరిశ్రమలను ఆకర్షించే విధంగా మౌలిక సదుపాయాల కల్పించాలన్నదే ప్రయత్నమని, డ్రైపోర్టు నిర్మాణం వంటి అనేక ప్రణాళికలకు రూపకల్పన చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించామని, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చుతాయని, తమ ప్రభుత్వం సహేతుకమైన ప్రణాళికలతో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఇతర రంగాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
వినూత్న కార్యక్రమాలతో ముందడుగు…
ప్రతి అంశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలన్నదే తమ ప్రయత్నమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య ఉద్యోగ, రాజకీయ సర్వే దేశానికి ఒక మోడల్గా నిలిచిందని, ఈ సర్వే సమాజాన్ని మరింత సమర్థవంతంగా గుర్తించి సేవలు అందించడంలో దోహదపడుతుందని అన్నారు. ఇది కేవలం బీసీల కోసమే కాదని, ఈ సర్వే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ ప్రజలకూ ఉపయోగపడుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ముందడుగు వేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మాడల్ను అమలు చేయాలని, ఈ రకంగా అనేక కోణాల్లో తెలంగాణ రైజింగ్ మొదలైందని ఆయన అన్నారు. తెలంగాణలోని వేర్వేరు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐసొలేషన్ గా సాగుతున్న విద్యను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా పిల్లల్లో సోషలైజేషన్ ప్రక్రియకు చేపట్టామని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయమని ఆయన చెప్పారు.
డీలిమిటేషన్ పై స్పష్టత అవసరం…
డీలిమిటేషన్కు తాము వ్యతిరేకం కాదని, కానీ ముందు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియకు సంబంధించి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి అందుకు ప్రాతిపదికను స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కావాలన్నదే తమ అభిమతం అని, అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలను శిక్షించకూడదని, ఇది సామాజిక, రాజకీయ న్యాయానికి సంబంధించిన అంశం అని, అందుకే చర్చ జరగాలని తాము అడుగుతున్నామని ఆయన అన్నారు.