- పాక్ పేరుతో బేకరీనా?
- భగ్గుమంటున్న దేశభక్తులు
- పేరు మార్చాలని డిమాండ్
సహనం వందే, విశాఖపట్నం:
విశాఖపట్నంలో కరాచీ అనే పేరు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. వెంకోజీపాలెం డైమండ్ పార్క్ రోడ్డులో కొన్నేళ్లుగా కొనసాగుతున్న కరాచీ బేకరీ పేరును మార్చాలంటూ స్థానిక జనజాగృతి సమితి సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో… శత్రుదేశ నగరమైన కరాచీ పేరుతో ఇక్కడ వ్యాపారం చేయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. ఈ పేరును వెంటనే మార్చాలని, లేదంటే బేకరీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు.
‘మా విశాఖలో పాక్ పేరు వద్దు!’
కరాచీ బేకరీ ముందు గుమిగూడిన జనజాగృతి సమితి కార్యకర్తలు ‘విశాఖలో పాకిస్తాన్ నగరం పేరు ఎందుకు?’ అంటూ నినాదాలు చేశారు. ఈ పేరు ప్రతి భారతీయుడి జాతీయ భావనలను కించపరిచేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఈ బేకరీ పేరుపై అప్పుడప్పుడు విమర్శలు వచ్చినప్పటికీ, ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఆందోళన మరింత తీవ్రమైంది. పది రోజుల్లో బేకరీ పేరు మార్చకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
చరిత్ర ముసుగులో తప్పించుకోలేరు!
కరాచీ బేకరీ 1953లో హైదరాబాద్లో ఏర్పాటైందని, దాని వ్యవస్థాపకులు విభజన సమయంలో కరాచీ నుంచి వచ్చారని కొందరు సమర్థిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ పేరుతో వ్యాపారం చేయడం ఎంతవరకు సమంజసమని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక బేకరీ పేరు మాత్రమే కాదని, దేశ సమగ్రతను, జాతీయ భావాలను అవమానించే చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర పేరుతో దేశద్రోహాన్ని సమర్థించే ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఉద్రిక్తతల వేళ.. మరింత రెచ్చగొట్టేలా!
భారత్-పాక్ సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అమాయక జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో శత్రుదేశం పేరుతో విశాఖలో బేకరీ కొనసాగించడం బాధాకరమని స్థానికులు అంటున్నారు. ఇది ప్రజల దేశభక్తిని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు!
ఈ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంతో మంది నెటిజన్లు కరాచీ బేకరీ పేరును తప్పుబడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘వెంటనే పేరు మార్చాలి’, ‘ఇలాంటి వాటిని సహించకూడదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు మరింత తీవ్రంగా స్పందిస్తూ బేకరీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికుల నుంచి మద్దతు…
ఈ వివాదం ఇప్పుడు విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపుతోంది. జనజాగృతి సమితి డిమాండ్కు స్థానికుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. కరాచీ బేకరీ యాజమాన్యం ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రజల మనోభావాలను గౌరవించి వారు పేరు మారుస్తారా లేక వివాదాన్ని మరింత పెద్దది చేస్తారా అనేది వేచి చూడాలి.
దేశభక్తి ముందు అన్నీ దిగదుడుపే!
కరాచీ బేకరీ పేరు వివాదం కేవలం ఒక వాణిజ్య సంస్థకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశభక్తికి, జాతీయ గౌరవానికి సంబంధించిన అంశం. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి, దేశ సమగ్రతను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ వివాదం మరింత పెద్దదయ్యే ప్రమాదం ఉంది.