ప్రభుత్వ డబ్బుతో ఏఐజీకి డప్పు

  • మిస్ వరల్డ్ కంటెస్టెంట్లతో ఏఐజీలో మెడికల్ టూరిజం ఈవెంట్
  • అందాల రాణులకు అందనంత దూరంలో నిమ్స్
  • ఐపీఎల్ మ్యాచ్ దందాలోనూ మిస్ వరల్డ్ కంటిస్టెంట్లు
  • మిస్ వరల్డ్ మనీ దందా… చేతులు మారుతున్న కోట్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వేదికపై పరువు తీసుకుంటోంది! అందాల పోటీల పేరుతో ప్రజల సొమ్మును యథేచ్ఛగా ధారపోస్తూ ప్రైవేట్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది. మెడికల్ టూరిజం ముసుగులో ఒకవైపు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వంటి ఆసుపత్రుల వ్యాపారానికి ఎర్ర తివాచీ పరుస్తోంది. మరోవైపు ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు పెంచేందుకు అందమైన అమ్మాయిలను వాడుకుంటోంది. ఇది ప్రభుత్వ సొమ్ముతో జరుగుతున్న వ్యాపారం కాదా? ప్రజల నమ్మకాన్ని మంటగలిపే దారుణమైన చర్య కాదా?

ఏఐజీకి ఎందుకంత ప్రాధాన్యత?
ఈ నెల 7 నుంచి చివరి వరకు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 116 దేశాల నుంచి అందాల రాణులు తరలి వస్తున్నారు. మూడు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వారిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతారు. తద్వారా ఆయా ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. చార్మినార్ వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం వంటి చారిత్రక ప్రదేశాలను కూడా వారు సందర్శించనున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ఈ నెల 16న మెడికల్ టూరిజంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం దారుణం. ఆధునిక ఆసుపత్రుల ప్రత్యేకతలను అందాల రాణులకు వివరిస్తారట! మెడికల్ టూరిజంలో హైదరాబాద్ అంటే కేవలం ఏఐజీ మాత్రమేనా? ప్రభుత్వ సొమ్ముతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి డప్పు కొట్టాల్సిన అవసరం ఏముంది? రెండు తెలుగు రాష్ట్రాలకు తలమానికమైన నిమ్స్ ఆసుపత్రి ప్రభుత్వానికి కనిపించలేదా? కేవలం మెరిసే భవంతి కలిగిన ఏఐజీ మాత్రమే కంటపడిందా? నిమ్స్‌ను పూర్తిగా విస్మరించి ఏఐజీని ప్రమోట్ చేయడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం కాదా?

నిమ్స్ లో అంతర్జాతీయ వైద్యం…
నిమ్స్‌లో గుండె సంబంధిత వ్యాధులకు, నరాల బలహీనతలకు, ఎముకల సమస్యలకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. జాతీయ అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి అద్భుతమైన సంస్థను విస్మరించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ప్రోత్సహించడం ప్రభుత్వ వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్ర కాదా? అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ వేదికపై నిమ్స్‌ను ప్రమోట్ చేయాల్సింది పోయి, ఏఐజీని ప్రోత్సహించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయంగా ఏఐజీ పేరు మారుమోగుతుంది. ఇది వారి మార్కెటింగ్ వ్యూహం అయితే కావచ్చు, కానీ ప్రభుత్వ అసమర్థతకు ఇది నిదర్శనం. ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు అందుబాటు ధరల్లో అత్యుత్తమ వైద్యం అందుతోంది. మెడికల్ టూరిజం పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులను వెనకేసుకొస్తే సామాన్యుడికి దిక్కెవరు?’ అని సామాజిక కార్యకర్త పృధ్వి రమేష్ తీవ్రంగా ప్రశ్నించారు. ఈ ఏఐజీ ప్రమోషన్ వెనుక ప్రభుత్వ పెద్దలకు, ఆసుపత్రి యాజమాన్యానికి మధ్య ఏదో రహస్య ఒప్పందం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

అందాల బొమ్మలతో ఐపీఎల్ టికెట్ల దందా!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 641 కోట్లతో 574 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ఈ భారీ వ్యయం వల్ల టికెట్ అమ్మకాలు అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. అందుకే మిస్ వరల్డ్ పోటీదారులను ఉపయోగించి, ఉచిత పబ్లిసిటీతో టికెట్ అమ్మకాలను పెంచాలని ఫ్రాంచైజీలు కుట్రపన్నాయి. ఇది అందాల పోటీల ఉద్దేశాన్ని అవమానించే చర్య కాదా? ఈనెల 20 లేదా 21 తేదీల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరవుతారు. ఆ మ్యాచ్‌లకు వీరిని తీసుకెళ్లి, టికెట్ల అమ్మకాలు పెంచుకోవాలని చూస్తున్నారు. ‘ఐపీఎల్ టికెట్ల కోసం మిస్ వరల్డ్ పోటీదారులను ఉపయోగించడం సిగ్గుచేటు. ఇది అందం, ప్రతిభను గౌరవించే వేదికను వ్యాపారానికి వాడుకోవడంలా ఉంద’ని క్రీడా విశ్లేషకుడు సురేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుక్కున్న ఫ్రాంచైజీలకు టికెట్ల అమ్మకం ఒక పెద్ద సమస్యగా మారింది. అందుకే ఈ అందాల పోటీల పేరుతో ఉచితంగా పబ్లిసిటీ పొందాలని, తద్వారా టికెట్లు అమ్ముకోవాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *