- పరీక్షల్లోనూ పవిత్రత పేరిట రాద్ధాంతం!
- నీట్ కేంద్రంలో రగిలిన జంధ్యం వివాదం
- పరీక్ష నిబంధనలు పట్టని పవిత్రవాదం
- ‘పూలే’ సినిమా వివాదం నుంచి నీట్ వరకు
సహనం వందే, బెంగళూరు:
దేశంలో పరీక్షలంటే విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. కానీ కొందరు మాత్రం తమ ఆచారాలను అడ్డుపెట్టుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని నీట్ పరీక్షా కేంద్రంలో జరిగిన జంధ్యం వివాదం ఇందుకు నిదర్శనం. సాంకేతికత పెరిగిపోయిన ఈ రోజుల్లో పరీక్షల్లో అనేక ఆంక్షలు సహజం. రింగులు, షూలు, గడియారాలు వంటి వాటితో పాటు, ఇప్పుడు ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణ విద్యార్థులు ధరించే జంధ్యాన్ని కూడా అనుమతించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా తీసుకుంటున్న ఈ చర్యను కొందరు బ్రాహ్మణులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని గగ్గోలు పెడుతున్నారు. తమ పవిత్రమైన జంధ్యాన్ని తీయమన్నందుకు ఏకంగా పరీక్షా సిబ్బందిని అరెస్టు చేయించడం వారి అతివాదానికి పరాకాష్ట.
జంధ్యం తీయమంటే గొడవలేంటి?
నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై ఎన్నో నియమాలు ఉంటాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మోసాలు జరగకుండా ఉండేందుకే ఈ ఆంక్షలు. చిన్న వస్తువుల్లోనూ టెక్నాలజీ దాగివున్న ఈ కాలంలో, భద్రత దృష్ట్యా కఠినంగా ఉండటం తప్పేమి కాదు. ఇందులో భాగంగానే ఉపనయనం అయిన బ్రాహ్మణ విద్యార్థులు ధరించే జంధ్యాన్ని కూడా తీసివేయమని చెప్పడంలో నిర్వాహకుల ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ కొందరు దీనిని భూతద్దంలో చూపిస్తూ తమ విశ్వాసాలను అవమానించారని రాద్ధాంతం చేస్తున్నారు.
‘పూలే’ సినిమా వివాదం నుంచి నీట్ వరకు…
ఇటీవల ‘పూలే’ సినిమాలో బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏకంగా సినిమా దర్శకుడిపైనే కేసు పెట్టడం చూశాం. ఇప్పుడు జంధ్యం విషయంలోనూ అదే తరహా అతివాదం ప్రదర్శిస్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో వివాదాలు సృష్టించడం కొందరికి అలవాటుగా మారిందా? పరీక్షల వంటి ముఖ్యమైన సమయంలో ఇలాంటి రాద్ధాంతాలు చేయడం విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వీరు ఆలోచించడం లేదా?