తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహజ్వాల

  • పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి
  • లేకుంటే జూన్ 9 తర్వాత ప్రత్యక్ష ఆందోళన
  • ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగులు
  • ఈహెచ్ఎస్ ను పటిష్టంగా అమలు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమైంది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక రోజు సుదీర్ఘ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు సమావేశమై, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9వ తేదీ తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

సదస్సులో ఉద్యోగుల ఆవేదన…
రాష్ట్రంలోని 33 జిల్లాలు, హైదరాబాద్ నగరం, సచివాలయ జాక్ కమిటీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. టీజీఈజేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ… ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత 13.31 లక్షల కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన నిర్లక్ష్య విధానాలతో ఉద్యోగులను అశాంతికి గురిచేసింది. ఆ నిరసనల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, ఆశించిన మార్పు కనిపించడం లేద’ని వారు ఆరోపించారు.

కీలక డిమాండ్లు…

  • మధ్యంతర భృతి (ఐఆర్), డీఏ బకాయిలు: గత ఏడాది జులై 1 నుంచి ఇవ్వాల్సిన ఐఆర్, 2023 జనవరి 1 నుంచి పెండింగ్‌లో ఉన్న నాలుగు డియర్‌నెస్ అలవెన్సుల (డీఏ)ను నగదు రూపంలో వెంటనే విడుదల చేయాలి.
  • బిల్లుల క్లియరెన్స్: 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలి. ఈ-కుబేర్ వ్యవస్థను రద్దు చేసి, ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించాలి.
  • తెలంగాణ పీఆర్సీ: ధరల పెరుగుదలకు అనుగుణంగా 51% ఫిట్‌మెంట్‌తో రెండో తెలంగాణ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సులను అమలు చేయాలి.
  • ఆరోగ్య పథకం: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను ప్రభుత్వం, లబ్ధిదారుల సమాన సహకారంతో అమలు చేయాలి.
  • హెచ్‌ఆర్‌ఏ, రవాణా సౌకర్యాలు: కొంగర కలాన్ వద్ద ఐడీఓసీ రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు 24% హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) మంజూరు చేయాలి. ఉద్యోగులకు రవాణా సౌకర్యాలు కల్పించాలి.
  • ఉపాధ్యాయుల డిమాండ్లు: స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపక వైద్యులకు ప్రత్యేక అలవెన్సులు మంజూరు చేయాలి.
  • అంగన్‌వాడీ సమస్యలు: అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లకు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. విధుల్లో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
  • వికలాంగుల సమస్యలు: వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పెండింగ్‌లో ఉన్న పీఆర్పీలను అమలు చేయాలి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *