జడ్జీల సంఘం నేతలు మురళిమోహన్, ప్రభాకరరావు సంతాపం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఆమె మృతికి తెలంగాణ జడ్జీల సంఘం అధ్యక్షులు కె. ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.మురళి మోహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. న్యాయసేవల రంగంలో ప్రియదర్శిని చేసిన కృషిని వారు కొనియాడారు. ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి…
ఆమె 2008 నవంబర్ 3న అదనపు జిల్లా జడ్జిగా చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఆగస్టు 2016 నుండి డిసెంబర్ 2018 వరకు ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, జనవరి 2019 నుండి అక్టోబర్ 2020 వరకు ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, అక్టోబర్ 2020 నుండి మార్చి 2022 వరకు కరీంనగర్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022 మార్చి 24న ఆమె తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.