డోర్ డెలివరీకి డ్రోన్లు

  • నిత్యవసర వస్తువుల సరఫరాలో విప్లవం
  • 10 నిమిషాల్లో ఇంటికే సరుకులు అందజేత
  • బెంగళూరులో వినూత్న ప్రక్రియ ప్రారంభం

బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ ఇప్పుడు డ్రోన్ డెలివరీలకు చిరునామాగా మారింది. బిగ్‌బాస్కెట్, స్కై ఎయిర్ మొబిలిటీ కలిసి ఇక్కడ డ్రోన్ ద్వారా నిత్యావసర వస్తువులు, మందులు డెలివరీ చేసే సేవలను ప్రారంభించాయి. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ఆర్డర్లు నేరుగా వినియోగదారుల ఇంటికే చేరుతుండటంతో ఇది సంచలనం సృష్టిస్తోంది. ట్రాఫిక్‌కు చెక్ పెడుతూ, పర్యావరణహిత డెలివరీకి ఈ సేవ ఊతమిస్తోంది.

డ్రోన్ డెలివరీ ఎలాగంటే?
స్కై ఎయిర్ మొబిలిటీకి చెందిన డ్రోన్లు ఒకేసారి 7 కిలోల వరకు బరువున్న వస్తువులను మోసుకెళ్లగలవు. ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాయింట్ వద్ద సిబ్బంది డ్రోన్ నుంచి వస్తువులను స్వీకరించి, అక్కడి నివాసితులకు అందిస్తారు. ఒకేసారి అనేక ఆర్డర్‌లను డెలివరీ చేసే సామర్థ్యం ఈ డ్రోన్‌లకు ఉంది. ఈ సేవకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకపోవడం విశేషం.

వేగం.. సామర్థ్యం.. పర్యావరణ పరిరక్షణ
ఈ డ్రోన్ డెలివరీ సేవ గేటెడ్ కమ్యూనిటీలో ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా సాధారణ రోడ్డు రవాణాతో పోలిస్తే కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. స్కై ఎయిర్ మొబిలిటీ సీఈఓ అంకిత్ కుమార్ మాట్లాడుతూ ‘మేము రోజుకు 40 నుంచి 50 ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాము. క్విక్ కామర్స్‌లో వేగమే ప్రధానం. మా బ్యాచింగ్ సిస్టమ్ సామర్థ్యాన్ని మరింత పెంచుతోంద’ని తెలిపారు. బిగ్‌బాస్కెట్ ఈ డెలివరీల కోసం 5 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

వ్యక్తిగత గోప్యతకు భరోసా…
స్కై ఎయిర్ మొబిలిటీ డ్రోన్‌లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతితో పనిచేస్తున్నాయి. వీటిలో ఉన్న శాటిలైట్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు వాటి కదలికలను పర్యవేక్షించవచ్చు. వినియోగదారుల గోప్యతను దృష్టిలో ఉంచుకుని డ్రోన్లలో కెమెరాలు ఏర్పాటు చేయలేదు. డ్రోన్లు 120 మీటర్ల ఎత్తులో ‘స్కై టన్నెల్’ అనే ప్రత్యేక మార్గంలో ప్రయాణిస్తాయి.

గురుగ్రామ్ లోనూ…
దేశంలోనే తొలిసారిగా వాణిజ్య డ్రోన్ డెలివరీ సేవను ప్రారంభించిన ఘనత గురుగ్రామ్‌ సొంతం. అక్కడ 7.5 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3-4 నిమిషాల్లో డ్రోన్లు చేరుకున్నాయి. గత ఏడాది గురుగ్రామ్‌లో 10 లక్షల డెలివరీలను పూర్తి చేసిన స్కై ఎయిర్ ఇప్పుడు బెంగళూరులో తన సేవలను విస్తరిస్తోంది. త్వరలో బన్నెర్‌ఘట్ట రోడ్ ప్రాంతంలో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

భవిష్యత్తు లక్ష్యాలు.. మరిన్ని సేవలు
స్కై ఎయిర్ మొబిలిటీ ఈ సేవలను బెంగళూరులోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పాటు, ఆహార డెలివరీ వంటి కొత్త రంగాల్లోనూ ప్రవేశించాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉన్న ఈ సంస్థ డ్రోన్ డెలివరీని మరింత అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తోంది. ‘డ్రోన్ డెలివరీలు లాజిస్టిక్స్ రంగంలో ఒక విప్లవాత్మక మార్పు. ఒక్కో డెలివరీ 520 గ్రాముల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంద’ని అంకిత్ కుమార్ తెలిపారు. ఈ డ్రోన్ డెలివరీ సేవ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది భవిష్యత్ డెలివరీ వ్యవస్థ అని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు భద్రత, గోప్యత, ఇతర అంశాల్లో దీని అమలుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *