- వేలాది ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములే
- అబద్ధాల పునాదులపై రాజధాని నిర్మాణం
- మోడీతో రెండోసారి శంకుస్థాపన ఒక మోసం
- రాజకీయ నాయకుల రియల్ ఎస్టేట్ దందా!
- జగన్ మూడు రాజధానుల నాటకం
సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి… ఇది రాజధాని కాదు, రాజకీయ నాయకుల కుట్రలకు, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం! 2015లో వేసిన అబద్ధపు పునాదులపై ఇప్పుడు వచ్చే నెల 2వ తేదీన మరోసారి శంకుస్థాపన డ్రామాకు తెరలేపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఈ రాజకీయ నాటకంలో ప్రజల ఆశలు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల జీవితాలు కూడా బలి అవుతున్నాయి. మొదటి శంకుస్థాపనతో వేల కోట్ల ప్రజాధనం స్వాహా అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ అదే తంతు ఎందుకు? వేల ఎకరాల భూసేకరణ పేరుతో జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందాలో అత్యధికంగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులేనని తేలుతోంది. లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో ఎవరి జేబులు నిండబోతున్నాయి?
ఇది కేవలం పొలిటికల్ స్టంట్…
2015 అక్టోబర్ 22న అమరావతికి జరిగిన మొదటి శంకుస్థాపన ఒక బూటకపు కార్యక్రమం. సింగపూర్ మాస్టర్ ప్లాన్ అంటూ ప్రజలను మభ్యపెట్టారు. కానీ ఐదేళ్ల టీడీపీ పాలనలో అక్కడ జరిగింది శూన్యం. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ పాత పాటే పాడుతున్నారు. పునర్నిర్మాణం పేరుతో రెండో శంకుస్థాపన అంటూ హడావిడి చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ స్టంట్. సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం అని కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. పదేళ్ల క్రితం వేల కోట్లు ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదు. మళ్లీ అదే తంతు ఎందుకు?
రియల్ మాఫియాకు బహుజనులు బలి!
అమరావతి కోసం 2014-19 మధ్య 34,000 ఎకరాలు సేకరించారు. ఇప్పుడు విమానాశ్రయం, రింగ్ రోడ్ల పేరుతో మరో 44,000 ఎకరాలు లాక్కోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ కొత్త భూసేకరణలో 90 శాతం వరకు భూములు కోల్పోయేది బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే. ఇప్పటికే వేల ఎకరాల్లో అభివృద్ధి లేదు. మళ్లీ ఇంత భారీగా భూసేకరణ ఎందుకు? దీని వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. ఈ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన బహుజనుల కడుపు కొట్టి, వారిని రోడ్డున పడేసే కుట్ర ఇది. ‘ఇప్పటికే 34,000 ఎకరాల్లో అభివృద్ధి లేదు. మరో 44,000 ఎకరాలు సేకరించి ఏం సాధించాలి? అందులోనూ మా భూములే ఎందుకు?’ అని బహుజన రైతులు నిలదీస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల భవిష్యత్తు తాకట్టు…
అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తారట! తొలి దశకే 48,000 కోట్లు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి ఇంత భారీ భారం అవసరమా? ఇది అభివృద్ధి కానే కాదు. బహుజనుల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఆడుకుంటున్న పందేలాట. ప్రపంచ బ్యాంక్ నుంచి రూ. 15,000 కోట్ల రుణం తెస్తున్నామని చెబుతున్నారు. కానీ ప్రపంచ బ్యాంకు కూడా ఈ ప్రాజెక్టులో అక్రమాలు ఉన్నాయన్న భావనతో నిధులు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ నిధులు ఇచ్చినా మిగిలిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? భూములు అమ్మి తెస్తారట! కానీ కొనేవారెవరు? ఇది ఒక స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని చెబుతున్నా ఆచరణలో అసాధ్యం. లక్ష కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని దివాళా తీయించేందుకు జరుగుతున్న ప్రయత్నం ఇది. ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా, పాలకులు మాత్రం బహుజనుల కష్టాలను పట్టించుకోకుండా తమ స్వార్థంతో ముందుకెళ్తున్నారు.
భూసేకరణ… బహుజన వ్యతిరేక స్కామ్!
అమరావతి భూసేకరణ మొదటి నుంచీ బహుజన వ్యతిరేక స్కామ్గానే కొనసాగుతోంది. 2014-15లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపించినా, ఆధారాలు లేవని కోర్టు కొట్టివేసింది. కానీ అక్రమాలు జరగలేదని చెప్పగలరా? ఇప్పుడు మళ్లీ 44,000 ఎకరాల సేకరణలోనూ అదే జరుగుతోంది. భారీగా బహుజనుల భూములు సేకరించి, అగ్రకులాలకు చెందిన ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు తెరవెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. రియల్ ఎస్టేట్ మాఫియాకు ఇది ఒక బంగారు గని. బహుజన రైతుల భూములు దోచుకుని వారిని నిండా ముంచేస్తున్నారు. ‘భారీగా బహుజనుల భూములు సేకరిస్తూ వాటిని ప్రైవేటు సంస్థలకు కేటాయించే అవకాశం ఉంది. ఇది రియల్ ఎస్టేట్ మాఫియాతో కలిసి బహుజనులను నాశనం చేసే కుట్ర’ అని బహుజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ద్రోహం ఇకనైనా ఆగాలి!
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న ఈ బహుజన ద్రోహం ఇకనైనా ఆగాలి. పదేళ్ల క్రితం వేసిన అబద్ధపు పునాదులపై మళ్లీ శంకుస్థాపనలు చేయడం బడుగు బలహీన వర్గాలను వంచించడమే. వేల ఎకరాల బహుజనుల భూములు లాక్కోవడం, లక్ష కోట్ల రూపాయల ఖర్చు.. ఇదంతా ఎవరి కోసం? అమరావతి ఒక అబద్ధాల నగరం కాకుండా నిజమైన అభివృద్ధికి ప్రతీకగా మారాలంటే బహుజనులు గళమెత్తాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిస్తున్నారు.