- భారత క్రికెట్కు ఒక కొత్త ఆశాకిరణం
- 14 ఏళ్లకే ఐపీఎల్ను ఊచకోత కోసిన వైభవ్!
- ఐపీఎల్ చరిత్రలో రెండో సెంచరీ వీరుడు
- రోజుకు 400 బంతులతో పవర్ హిట్టింగ్…
- ధోనితో పోలిక… బీహార్కు కొత్త హీరో
సహనం వందే, పాట్నా:
జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే మెరుపు శతకం బాది, క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ బీహార్ బుల్డోజర్… గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై 11 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుడిగా నిలిచిన వైభవ్ వెనుక ఎన్నో త్యాగాలు, కఠోర సాధన ఉన్నాయి.
బాల్యంలోనే బ్యాట్తో బంధం…
2011 మార్చి 27న బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో జన్మించిన వైభవ్కు నాలుగేళ్ల వయసులోనే క్రికెట్తో అవినాభావ సంబంధం ఏర్పడింది. క్రికెట్ ఆడే తండ్రి సంజీవ్ సూర్యవంశీ, ప్లాస్టిక్ బంతితో ఆడుతున్న కొడుకులోని సహజమైన టాలెంట్ను గుర్తించాడు. ఇంటి వెనుక చిన్న ప్రాక్టీస్ పిచ్ ఏర్పాటు చేసి, వైభవ్కు బేసిక్స్ నేర్పించాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొడుకు కలను నిజం చేసేందుకు సంజీవ్ తన భూమి అమ్మి సమస్తిపూర్లోని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు.
రోజుకు 400 బంతులతో పవర్ హిట్టింగ్…
వైభవ్ ఈ స్థాయిలో బౌలర్లను చితక్కొట్టడానికి కారణం అతని చిన్ననాటి నుంచే ఉన్న కఠోర సాధన. అతని చిన్ననాటి కోచ్ చెప్పినట్లుగా, వైభవ్ రోజూ నెట్స్లో 350 నుంచి 400 బంతులతో ప్రాక్టీస్ చేసేవాడు. ఈ అలుపెరగని ప్రాక్టీస్ అతని బ్యాటింగ్ టెక్నిక్ను, పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. లెఫ్ట్-హ్యాండ్ బ్యాటింగ్లో దూకుడుగా ఆడే వైభవ్ ఆటతీరు చూస్తుంటే యువరాజ్ సింగ్ గుర్తుకొస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. 9 ఏళ్ల వయసులో సమస్తిపూర్ అకాడమీలో చేరిన వైభవ్, మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓఝా శిక్షణలో రాటుదేలాడు.
లాక్డౌన్లో టెర్రస్ పిచ్పై మెరుపులు!
2021లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో క్రికెట్ గ్రౌండ్లు మూతపడినా, 10 ఏళ్ల వైభవ్ తన సాధనను ఆపలేదు. ఇంటి టెర్రస్పైనే నెట్ ఏర్పాటు చేసుకుని గంటల తరబడి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ టెర్రస్ సెషన్స్ అతని ధైర్యాన్ని, బలంగా బంతిని బాదే నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచాయి. ఈ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతని అంకితభావానికి ఇది నిదర్శనం.
పాట్నాలో పదునైన శిక్షణ…
సమస్తిపూర్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో వైభవ్ తన తండ్రితో కలిసి పాట్నాకు వెళ్లాడు. అక్కడ కోచ్ బ్రజేష్ ఝా ఆధ్వర్యంలో అత్యాధునిక శిక్షణ పొందాడు. ఈ శిక్షణ వైభవ్ బ్యాటింగ్లో టైమింగ్, షాట్ సెలెక్షన్, ఫిట్నెస్ను మెరుగుపరిచింది. అతని కఠోర శ్రమ విజయ శిఖరాలకు దారి చూపింది.
కోట్లు కురిపించిన టాలెంట్!
ఐపీఎల్ 2025 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నాగ్పూర్లో నిర్వహించిన ట్రయల్స్లో వైభవ్ను పరీక్షించింది. ఒక ఓవర్లో 17 పరుగులు చేయాలని కోచ్ అడిగితే, వైభవ్ మొదటి మూడు బంతుల్లోనే హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ అతన్ని ఏకంగా 1.1 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. లెజెండరీ కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో వైభవ్ తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటున్నాడు.
ఐపీఎల్కు ముందు స్టార్లతో ప్రాక్టీస్..
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు వైభవ్ రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ సెషన్స్లో యశస్వి జైస్వాల్, జోఫ్రా ఆర్చర్ లాంటి స్టార్ ప్లేయర్లతో కలిసి సాధన చేశాడు. యశస్వి బ్యాటింగ్ చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆర్చర్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొన్నానని వైభవ్ చెప్పాడు. ఈ సెషన్స్ అతని ఆత్మవిశ్వాసాన్ని, టెక్నిక్ను మరింత పెంచాయి. రాజస్థాన్ రాయల్స్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో వైభవ్ ఆడిన పవర్ పుల్ షాట్స్, స్లాగ్ స్వీప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నేర్చుకుంటూ ఎదుగుతున్న యంగ్ గన్!
వైభవ్ అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ అతని ఆటలో ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ వేసిన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో వైభవ్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అతని ఫుట్వర్క్, షాట్ సెలెక్షన్లో కొన్ని లోపాలు కనిపించాయి. 12 బంతుల్లో 6 సార్లు బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. అయితే 14 ఏళ్ల వయసులో ఈ అనుభవాలు అతనికి మంచి పాఠాలు నేర్పుతాయని కోచ్లు భావిస్తున్నారు.
తండ్రి త్యాగం… విజయానికి బాటలు!
వైభవ్ విజయం వెనుక అతని తండ్రి సంజీవ్ చేసిన త్యాగం, అతని కోచ్ల సరైన మార్గదర్శకత్వం ఎంతో ఉన్నాయి. కొడుకు క్రికెట్ కలను నిజం చేయడానికి సంజీవ్ తన భూమిని అమ్మి, మెరుగైన శిక్షణ కోసం పాట్నాకు పంపాడు. ‘వైభవ్ ఇప్పుడు నా కొడుకు మాత్రమే కాదు. మొత్తం బీహార్కు చెందినవాడ’ని సంజీవ్ గర్వంగా చెబుతున్నారు.
భవిష్యత్తు లక్ష్యం… టీమిండియా
వైభవ్ తన భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు ఆడాలని, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఒక స్థిరమైన ఆటగాడిగా రాణించి, అన్ని ఫార్మాట్లలో ఆడగల ఆల్-రౌండర్గా ఎదగాలని అతను ఆశిస్తున్నాడు. బ్రియాన్ లారా, విరాట్ కోహ్లీలను తన ఆదర్శంగా తీసుకున్న వైభవ్… క్రికెట్తో పాటు చదువుపై కూడా దృష్టి సారిస్తున్నాడు.
ధోనితో పోలిక… బీహార్కు కొత్త హీరో
ఎంఎస్ ధోని… జార్ఖండ్ నుంచి ఉద్భవించి భారత క్రికెట్కు అపూర్వమైన కీర్తిని తెచ్చాడు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ బీహార్కు కొత్త గుర్తింపును అందిస్తున్నాడు. ధోని జార్ఖండ్ యువతకు స్ఫూర్తిగా నిలిచినట్లే, వైభవ్ బీహార్ యువ క్రీడాకారులకు ఆదర్శంగా మారుతున్నాడు. బీహార్లో క్రికెట్ బోర్డు లేనప్పటికీ, వైభవ్ తన ప్రతిభతో రాష్ట్రానికి కొత్త గుర్తింపును తెచ్చాడు.