నెలకు 60 కోట్ల సంపాదన లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలతో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేసినట్లు రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన కీలక సమావేశంలో నెలకు సుమారు రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించేందుకు వ్యూహరచన జరిగిందని రిమాండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఈ వ్యవహారంలో మద్యం పాలసీ రూపకల్పనతో పాటు తదుపరి నిర్ణయాల్లోనూ సజ్జల శ్రీధర్ రెడ్డి చురుకుగా వ్యవహరించారని తేలింది. అంతేకాకుండా ప్రముఖ బ్రాండ్లను తొలగించి, తమకు అనుకూలమైన తయారీదారులను ప్రోత్సహించడంలో ఆయన ముఖ్య భూమిక పోషించినట్లు తెలుస్తోంది.

నాసిరకం బ్రాండ్లకు ఊతం

పోలీసులు నమోదు చేసిన కేసు ప్రకారం సజ్జల శ్రీధర్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 409, 420, 120 (బి)తో పాటు సెక్షన్లు 34 & 37, అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 7ఏ, 8, 13 (1) (బి), 13 (2) వర్తిస్తాయి. రిమాండ్ రిపోర్ట్‌లో ప్రధానంగా పేర్కొన్న అంశం ఏమిటంటే, మార్కెట్‌లో మంచి పేరున్న మద్యం బ్రాండ్లను నిలిపివేసి, నాణ్యత లేని బ్రాండ్లను చలామణిలోకి తీసుకురావడంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డిలతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారని రిపోర్ట్‌లో స్పష్టంగా ఉంది.

ఎస్పీవై డిస్టిలరీకి అక్రమంగా రూ. 45 కోట్లు…

ఎస్పీవై డిస్టిలరీల వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు అక్రమంగా రూ. 45 కోట్ల రుణం అందించాలని శ్రీధర్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని రిపోర్ట్‌లో ఉంది. దీని ఫలితంగా అరబిందో గ్రూప్ కంపెనీల నుంచి ఈ రుణం మంజూరైంది. విచారణలో శ్రీధర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం… జగన్ మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డిలతో కూడిన ఒక మద్యం సిండికేట్‌కు 12% వడ్డీతో ఈ రుణాన్ని తిరిగి చెల్లించారు. ఈ అక్రమ లావాదేవీ అరబిందో గ్రూప్ ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందడానికి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్‌లో సజ్జల శ్రీధర్ రెడ్డిని ఈ సిండికేట్‌లోని కీలక సభ్యుడిగా, ఈ మొత్తం నేరానికి ప్రధాన సూత్రధారిగా, అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా అభివర్ణించారు.

ఓఎఫ్ఎస్ జారీలో అక్రమాలు…

ప్రముఖ మద్యం బ్రాండ్‌లను ఉద్దేశపూర్వకంగా అణచివేయడానికి, చట్టవిరుద్ధంగా ఆర్డర్ ఫర్ సప్లై (ఓఎఫ్ఎస్) జారీ చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన డిస్టిలరీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ, సిండికేట్ సభ్యులకు ఎప్పటికప్పుడు ముడుపులు (కిక్‌బ్యాక్‌లు) అందేలా చూసుకునేవారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో ఆయనకున్న సన్నిహిత సంబంధాన్ని ఉపయోగించి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వంటి అధికారులకు వారికి కావలసిన కంపెనీలకు ఓఎఫ్ఎస్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసేవారు. వారి డిమాండ్లను పట్టించుకోని పక్షంలో ఓఎఫ్ఎస్ నిలిపివేస్తామని బెదిరించేవారని కూడా రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మద్యం సరఫరా, దాని ద్వారా జరిగే నగదు లావాదేవీల గురించిన పూర్తి సమాచారం శ్రీధర్ రెడ్డికి ఎప్పటికప్పుడు అందుతూ ఉండేదని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *