- ప్రేమ పిచ్చోడి లవ్ స్టోరీ మళ్లీ మొదలు
- మనీలాండరింగ్ ఖైదీ సుకేశ్ చంద్రశేఖర్ ప్రేమ లేఖలు…
సహనం వందే, హైదరాబాద్:
మనీలాండరింగ్ కేసులో ఊచలు లెక్కబెడుతున్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లోకెక్కాడు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి చనిపోయినందుకు సంతాపం తెలుపుతూ… ఏకంగా ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో కొంత భాగాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడట! ఈ ప్రేమ పిచ్చోడు ఢిల్లీలోని జైలు నుంచి రాసిన లేఖలో ఈ విషయం వెల్లడించాడు.
బాలీలో నీకో అందమైన లోకం!
తన లేఖలో సుకేశ్… జాక్వెలిన్ తల్లి మరణం తనను తీవ్రంగా బాధించిందని, ఆమె మళ్లీ తమకు కూతురిగా పుడుతుందని భావోద్వేగంగా రాసుకొచ్చాడు. అంతేకాదు… “నీవు ఎప్పటికీ నా జీవితంలో ఒక భాగం. బాలీలోని అందమైన ద్వీపంలో కొంత భూమిని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. అది నీకు ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది” అంటూ ప్రేమ వర్షం కురిపించాడు. ఒకవేళ జాక్వెలిన్కు డబ్బు ఇబ్బందులు ఉంటే తాను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం విశేషం.
మళ్లీ మొదలైన ప్రేమ డ్రామా!
జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుకేశ్ చంద్రశేఖర్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ గతంలోనూ పెద్ద దుమారం రేపింది. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ను ఈడీ చాలాసార్లు విచారించింది. సుకేశ్ నుంచి ఆమె ఖరీదైన గిఫ్ట్లు, డబ్బు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. అయితే సుకేశ్ రాసిన ఈ తాజా ప్రేమ లేఖ, గిఫ్ట్ ఆఫర్పై జాక్వెలిన్ కానీ ఆమె టీమ్ కానీ ఇంకా స్పందించలేదు. గతంలో కూడా సుకేశ్ జైలు నుంచే జాక్వెలిన్కు ప్రేమ లేఖలు రాస్తూ… వారి బంధాన్ని బహిరంగంగా చాటిచెప్పాడు. ఆ లేఖలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ బాలీ ద్వీపం గిఫ్ట్ నిజమైనదా లేక ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనా అనేది తేలాల్సి ఉంది