‘మోదీ అంతర్గత ఉగ్రవాది’

పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘అంతర్గత ఉగ్రవాది’గా అభివర్ణిస్తూ, దేశ నిఘా వ్యవస్థలను ఆయన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పనిచేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు.

మోడీకి పాలించే హక్కు లేదు!

కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రత విషయంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై షర్మిల నిప్పులు చెరిగారు. “కోట్ల మంది పర్యాటకులు వెళ్లే ప్రాంతంలో భద్రతా లోపం ఎలా జరిగింది? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఉగ్రవాదాన్ని నియంత్రించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిది. చౌకిదార్ అని చెప్పుకునే మోదీ అసలు ఎవరి కోసం కాపలా కాస్తున్నారు? దేశం కోసమా? కేవలం బీజేపీ కోసమా? ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మోదీ, అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి. వీరికి పాలించే హక్కు లేదు,” అని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు.

నిఘా వ్యవస్థ నిర్వీర్యం… దేశ భద్రత గాలికి!

దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం కాకుండా బీజేపీ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకుంటోందని షర్మిల ఆరోపించారు. “దేశ దర్యాప్తు సంస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా మోదీ కోసమే పనిచేస్తోంది. దేశ భద్రతను గాలికొదిలేశారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమే,” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మతాల మధ్య చిచ్చు… బీజేపీ కుట్ర!

దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. “అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మోదీ తన శ్రద్ధను దేశ భద్రతపై పెట్టి ఉంటే బయటి వ్యక్తులు చొరబడే పరిస్థితి ఉండేది కాదు,” అని ఆమె కుండబద్దలు కొట్టారు. మోదీని ‘అంతర్గత ఉగ్రవాది’గా అభివర్ణిస్తూ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *