- డబ్బు లాండరింగ్ ఆరోపణలతో సోదాలు
- విద్యార్థుల భవితతో చెలగాటం
- కోచింగ్ మాఫియా ఆగడాలు!
సహనం వందే, ఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిట్జీ వంటి కార్పొరేట్ కోచింగ్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాటి దాడులు విద్యా రంగంలో పేరుకుపోయిన రాక్షస క్రీడకు అద్దం పడుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లలోని ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాలు డబ్బు లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో జరగడం కేవలం గమనార్హం. వేల కోట్ల రూపాయల ఫీజులు దండుకుని, విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న ఈ విద్యా వ్యాపారుల అసలు స్వరూపం ఇంకా బయటపడాల్సి ఉంది.
రోడ్డుపైకి 12,000 మంది విద్యార్థులు…
లక్షలు లక్షలు గుంజుకుని ఆ తర్వాత సెంటర్లు మూసేయడం లేదా నిధులను మళ్లించడం వంటి చర్యలు ఫిట్జీ వంటి సంస్థలకు వెన్నతో పెట్టిన విద్య. సుమారు 12,000 మంది విద్యార్థులు నడిరోడ్డున పడటం ఈ సంస్థల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఈడీ దాడుల్లో వెలుగుచూసే నిజాలు ఈ విద్యా మాఫియా యొక్క చీకటి కోణాలను మరింత భయానకంగా చూపించే అవకాశం ఉంది.
నీట్ లీకులు… రావు ఐఏఎస్ మరణాలు
ఫిట్జీ ఒక్కటే కాదు… దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్ల పేరుతో జరుగుతున్న మోసాలు విద్యార్థుల అమాయకత్వాన్ని, వారి కలలను చిదిమేస్తున్నాయి. 2024లో నీట్ పేపర్ లీక్ స్కామ్లో కోచింగ్ సెంటర్ల హస్తం ఉండటం విద్యా వ్యవస్థకే మాయని మచ్చ. లక్షలు తీసుకుని పేపర్లు అమ్మడం, నకిలీ హామీలు ఇవ్వడం వంటి చర్యలు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే. కోల్కతాలో నకిలీ అడ్మిషన్ల పేరుతో రూ.16 లక్షలు దండుకోవడం, ఢిల్లీలోని రావు ఐఏఎస్ స్టడీ సర్కిల్లో వరదల కారణంగా ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు కోచింగ్ సంస్థల నిర్లక్ష్యానికి పరాకాష్ట. లాభాల కోసం విద్యార్థుల భద్రతను కూడా పట్టించుకోని ఈ వ్యాపారులు మానవత్వాన్ని మరిచిపోయారా? బైజూస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం అబద్ధపు ప్రకటనలతో విద్యార్థులను నిలువునా ముంచడం ఈ విద్యా వ్యాపారుల నైతిక దిగజారుడుతనానికి నిదర్శనం.