- నోటీసులు జారీ… 27న రావాలని ఆదేశం
- యాడ్స్ వల్ల ప్రజల జీవితాలపై ప్రభావం
- ఆయన చేసిన ‘రియల్’ కంపెనీ మోసాలు
- అనధికార లేఅవుట్లలో ప్లాట్ల విక్రయం
- ఒకే ప్లాట్ను అనేకసార్లు అమ్మడం
సహనం వందే, హైదరాబాద్:
తెలుగు సినీ వినీలాకాశంలో సూపర్స్టార్గా వెలుగొందే మహేశ్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక మోసాల కేసులో ఈ నోటీసులు ఇవ్వడం ఆయన అభిమానులను షాక్కు గురిచేసింది. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా మహేశ్ బాబు తన స్టార్డమ్ను ఉపయోగించి, అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఉపకరించారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటన సినీ తారల బాధ్యతారహిత్యం, డబ్బు కోసం సామాజిక బాధ్యతను విస్మరించే వైఖరిని నిలువెల్లా బయటపెట్టింది.
డబ్బు కోసం ధర్మం మరిచారా?
మహేశ్ బాబు ఈ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రాజెక్టులకు ప్రచారం చేసినందుకు రూ. 5.9 కోట్లు అందుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రూ.3.4 కోట్లు చెక్ ద్వారా, రూ.2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు సమాచారం. ఈ నగదు లావాదేవీలు మనీ లాండరింగ్కు సంబంధించినవని ఈడీ అనుమానిస్తోంది. ఈ నెల 27న హైదరాబాద్లో విచారణకు హాజరు కావాలని మహేశ్కు ఆదేశాలు జారీ అయ్యాయి. సూపర్స్టార్ అనే హోదా ఉన్న వ్యక్తి సంస్థల నైతికతను పరిశీలించకుండా, కేవలం డబ్బు కోసం ఇలాంటి ఒప్పందాలకు ఒడిగట్టడం ఎంతవరకు సమర్థనీయమని పలువురు నిలదీస్తున్నారు.
రియల్ ఎస్టేట్ మోసాలు…
సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ సంస్థలు అనధికార లేఅవుట్లలో ప్లాట్లను విక్రయించడం, ఒకే ప్లాట్ను అనేకసార్లు అమ్మడం, నకిలీ రిజిస్ట్రేషన్ హామీలతో ప్రజలను మోసం చేశాయని తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్లు వెల్లడిస్తున్నాయి. ఈ కంపెనీలు రూ. 100 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి. మహేశ్ బాబు వంటి స్టార్ హీరో ఈ ప్రాజెక్టులకు ప్రకటనలు ఇవ్వడం వల్ల, సామాన్యులు వీటిని నమ్మి, తమ జీవితకాల సంపాదనను పెట్టుబడిగా పెట్టారు. ఫలితంగా వేలాది మంది ఆర్థికంగా నడిరోడ్డున నిలిచారు. ఈ మోసాలకు మహేశ్ నేరుగా బాధ్యుడు కాకపోయినా, ఆయన స్టార్డమ్ ఈ మోసాలకు ఊతమిచ్చిందనడంలో సందేహం లేదు.