- అడ్డొచ్చిన కన్నబిడ్డలనే హత్య చేస్తున్న దుస్థితి
- వివాహేతర సంబంధం నేరంకాదన్న ఢిల్లీ కోర్టు
- తమకు ఇష్టం వచ్చినట్లు తీర్పుకు వక్ర భాష్యం
- 2023లో 50 వేల మంది మహిళల హత్య
- అందులో 60% కుటుంబ సభ్యుల చేతుల్లోనే
- ఓయో రూమ్స్ అడ్డా.. సోషల్ మీడియా ఊబి
సహనం వందే, క్రైమ్ బ్యూరో, హైదరాబాద్:
వివాహేతర సంబంధం నేరం కాదని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు.. నేటి సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు మరింత ఊతమిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పును కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ.. తమ వికృత చేష్టలకు చట్టపరమైన అనుమతి లభించినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా వివాహ బంధాలు తెగిపోతున్నాయి. రక్తపుటేరులు పారుతున్నాయి.
వివాహేతర సంబంధాల మోజులో…
భారతీయ సంస్కృతిలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. జన్మజన్మల బంధంగా చెప్పుకునే ఈ పవిత్ర బంధాన్ని కొందరు క్షణికమైన సుఖాల కోసం తెంచుకుంటున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి.. కట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. ఇది కేవలం కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే కాదు.. దారుణమైన హత్యలకు కూడా దారితీస్తోంది.
ఓయో రూమ్స్.. సోషల్ మీడియా!
నేటి ఆధునిక యుగంలో నగరాల్లో పాశ్చాత్య సంస్కృతి పెరగడంతో పాటు అనైతిక సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి. ఓయో రూమ్స్, స్టార్ హోటళ్లు వంటివి అక్రమ సంబంధాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇక సోషల్ మీడియా అయితే… ఇటువంటి వాటికి ఊతమిచ్చే ఒక పెద్ద వేదికగా తయారైంది. గంటల తరబడి ఇతరులతో అసభ్యకరమైన చాటింగ్ లు చేయడం, రహస్యంగా కలుసుకోవడం వంటివి భార్యాభర్తల మధ్య అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ అనుమానాలే చివరికి హత్యల వంటి దారుణాలకు కారణమవుతున్నాయి.
కాపురాల్లో చిచ్చు.. కడతేరుతున్న బతుకులు!
వివాహేతర సంబంధాలు కేవలం కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే కాదు.. దారుణమైన హత్యలకు కూడా కారణమవుతున్నాయి. 2023 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 50 వేల మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. వీరిలో 60 శాతం మందిని వారి భర్తలు, సహచరులు లేదా కుటుంబ సభ్యులే అత్యంత కిరాతకంగా చంపేశారు. భాగస్వామిని చంపిన తర్వాత మృతదేహాలను డ్రమ్ములు, ఫ్రిజ్లు, సూట్కేసులు, భూమిలో పాతి పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కొన్నిసార్లు మృతదేహాలను ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన భయానక ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
అడ్డం వస్తే కన్న బిడ్డలైనా ఖతమే…
ఇటీవల హైదరాబాద్లో ఒక మహిళ తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న ముగ్గురు కన్నబిడ్డలను అత్యంత కిరాతకంగా చంపేసింది. అంతకుముందు కర్మన్ఘాట్లో ఒక మహిళ భర్తను చంపి, శరీరాన్ని ముక్కలు చేసి ఉడకబెట్టి చెరువులో పారేసింది. ఆస్తి గొడవల కారణంగా బెంగళూరులో ఏకంగా ఒక మాజీ డీజీపీనే అతని భార్య హత్య చేసింది. లఖ్నవ్ లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసి, మృతదేహాన్ని సూట్కేసులో ప్యాక్ చేసి పక్క రైల్వే స్టేషన్ వద్ద విసిరిన సంఘటన ఇటీవల జరిగింది. అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదాల కారణంగా భార్యలు భర్తలను, భర్తలు భార్యలను చంపుకుంటున్నారు. అక్రమ సంబంధాలు, స్వార్థపూరిత ఆలోచనలు మనిషిని ఎంతటి దారుణమైన నేరాలకు పాల్పడేలా చేస్తున్నాయో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి. నమ్మకం, ప్రేమ లేని బంధాలు ఎక్కువ కాలం నిలవలేవని ఈ ఘోరమైన నేరాలు నిరూపిస్తున్నాయి.