మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారని కార్యదర్శి తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లైన tgbie.cgg.gov.in మరియు ప్రముఖ వెబ్సైట్ results.eenadu.net లలో తెలుసుకోవచ్చు.
తెలంగాణ వ్యాప్తంగా గత నెల 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అంతకుముందు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి వారి హాల్టికెట్ నెంబర్ను వెబ్సైట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫలితాల కోసం విద్యార్థులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.