పెట్టుబడులకు రండి.. రేవంత్ రెడ్డి ఆహ్వానం!
సహనం వందే, జపాన్
వరల్డ్ ఎక్స్పో 2025లో భారతదేశం నుండి మొట్టమొదట పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం…
సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా మారుస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్ కంపెనీలను ఆహ్వానిస్తూ, హైదరాబాద్లో ఉత్పత్తులను తయారు చేసి, భారత మార్కెట్తో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలని కోరారు. ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయానికి ఈ పర్యటన నాంది కావాలని ఆకాంక్షించారు.
ఫ్యూచర్ సిటీ, ఇండస్ట్రియల్ పార్క్…
హైదరాబాద్లో 30,000 ఎకరాలలో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం జరుగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జపాన్కు చెందిన మరుబెని కార్పొరేషన్తో కలిసి ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
మౌలిక సదుపాయాలు, డ్రై పోర్ట్…
హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.