- ఆరుగురు స్నేహితుల అద్భుత విజయం
- ఒకే శిక్షణ కేంద్రంలో చదివి జేఈఈలో టాపర్స్
సహనం వందే, కోట:
ఒకే శిక్షణ కేంద్రంలో కలిసి చదివిన ఆరుగురు స్నేహితులు జేఈఈ మెయిన్స్-2025 పరీక్షలో అపూర్వ విజయాన్ని సాధించారు. రాజస్థాన్ కోట కేంద్రంగా వీరంతా సమిష్టిగా చదివి 100 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా కేవలం 24 మంది మాత్రమే సాధించిన 100 పర్సంటైల్లో ఈ ఆరుగురు ఉండటం విశేషం. ఈ ఆరుగురి స్నేహబంధం, పట్టుదల, అవిశ్రాంత కృషి ఎందరికో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది.
ఒకే చోట చదివి లక్ష్యాన్ని ఛేదించి…
కోటకు చెందిన అర్ణవ్ సింగ్ (టాప్ 11), రజిత్ గుప్తా (టాప్ 16), లక్ష్య శర్మ (టాప్ 22), అలాగే ఒడిశాకు చెందిన ఓం ప్రకాష్ బెహరా (టాప్ 1), హర్యానాకు చెందిన సక్షమ్ జిందాల్ (టాప్ 10), జార్ఖండ్కు చెందిన అనస్ (టాప్ 17)… అందరూ కోటలోని ఒకే ప్రతిష్టాత్మకమైన శిక్షణ కేంద్రంలో కలిసి చదివారు. విద్యాపరమైన సహకారంతో మొదలైన వీరి స్నేహం, పరీక్షల సమయంలో ఒకరికొకరు అండగా నిలవడానికి ఎంతో ఉపయోగపడింది. తాము ఒకే శిక్షణ కేంద్రంలో చదవడం ఎంతో కలిసివచ్చింది. ఒకరి సందేహాలను మరొకరు నివృత్తి చేసుకునేవాళ్లం, పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండేదని అర్ణవ్ సింగ్ తెలిపాడు.
బాంబే ఐఐటీ లక్ష్యం…
ఈ ఆరుగురు స్నేహితులు జేఈఈ మెయిన్స్లో అద్భుత విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్పై దృష్టి సారించారు. వీరందరూ ఐఐటీ బొంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలని కలలు కంటున్నారు. ఈ ఆరుగురు స్నేహితుల విజయం కేవలం ఒక పరీక్షలో సాధించిన ర్యాంకుల గురించి మాత్రమే కాదు. ఇది స్నేహం, సమిష్టి కృషి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకోవచ్చని నిరూపిస్తుంది. కోటలోని పోటీ వాతావరణంలోనూ వీరు తమ స్నేహాన్ని నిలబెట్టుకుంటూ, విజయానికి బాటలు వేసుకున్నారు.