- బెంగుళూరులో ఘాతకం
- పోలీసుల అదుపులో భార్య పల్లవి
సహనం వందే, బెంగళూరు:
బెంగళూరు నగరంలో ఆదివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర మాజీ పోలీసు బాస్, 1981 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ (68) తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హృదయ విదారక ఘటన హెచ్ఎస్ఆర్ లేఔట్లోని ఆయన స్వగృహంలో సంభవించింది. పోలీసులు అనుమానిస్తున్న ప్రకారం… ఆయన భార్య పల్లవి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.
“నేనే రాక్షసుడిని చంపాను!”
పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పల్లవి ఆదివారం సాయంత్రం తనకు అత్యంత సన్నిహితురాలైన మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యకు వీడియో కాల్ చేసిందని తెలిసింది. ఆ కాల్లో ఆమె తాను “రాక్షసుడిని” (ఓం ప్రకాశ్ను ఉద్దేశిస్తూ) హతమార్చినట్లు సంచలన ప్రకటన చేసింది. తన చర్యను ఆమె స్వయంగా ఆ వీడియో కాల్లో వెల్లడించినట్లు సమాచారం.
రక్తపు మడుగులో ప్రకాష్…
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అక్కడే పడి ఉన్న ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా ఈ కత్తితోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పల్లవి స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
పోలీసు వర్గాల్లో కలకలం…
ఈ దారుణ ఘటన బెంగళూరు పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఓం ప్రకాష్ ఐపీఎస్ అధికారిగా కర్ణాటక రాష్ట్రంలో అనేక కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. పదవీ విరమణ తర్వాత ఆయన హెచ్ఎస్ఆర్ లేఔట్లో తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఈ హత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు కుటుంబ కలహాలు లేదా వ్యక్తిగత విభేదాలే ఈ ఘాతుకానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. పల్లవిని అదుపులోకి తీసుకుని లోతుగా ప్రశ్నిస్తున్నారు.