భార్య చేతిలో మాజీ డీజీపీ హత్య

బెంగళూరు నగరంలో ఆదివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర మాజీ పోలీసు బాస్, 1981 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ (68) తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హృదయ విదారక ఘటన హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని ఆయన స్వగృహంలో సంభవించింది. పోలీసులు అనుమానిస్తున్న ప్రకారం… ఆయన భార్య పల్లవి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

“నేనే రాక్షసుడిని చంపాను!”
పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పల్లవి ఆదివారం సాయంత్రం తనకు అత్యంత సన్నిహితురాలైన మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యకు వీడియో కాల్ చేసిందని తెలిసింది. ఆ కాల్‌లో ఆమె తాను “రాక్షసుడిని” (ఓం ప్రకాశ్‌ను ఉద్దేశిస్తూ) హతమార్చినట్లు సంచలన ప్రకటన చేసింది. తన చర్యను ఆమె స్వయంగా ఆ వీడియో కాల్‌లో వెల్లడించినట్లు సమాచారం.

రక్తపు మడుగులో ప్రకాష్…
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అక్కడే పడి ఉన్న ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా ఈ కత్తితోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పల్లవి స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

పోలీసు వర్గాల్లో కలకలం…
ఈ దారుణ ఘటన బెంగళూరు పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఓం ప్రకాష్ ఐపీఎస్ అధికారిగా కర్ణాటక రాష్ట్రంలో అనేక కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. పదవీ విరమణ తర్వాత ఆయన హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఈ హత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు కుటుంబ కలహాలు లేదా వ్యక్తిగత విభేదాలే ఈ ఘాతుకానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. పల్లవిని అదుపులోకి తీసుకుని లోతుగా ప్రశ్నిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *