- వీసా రద్దుల్లో 50 శాతం ఇండియన్లవే
- విద్యార్థుల భవిష్యత్తుపై వేలాడుతున్న కత్తి
- భారతీయులు లక్ష్యం కాదని బుకాయింపు
- ఇండియా మద్దతుకు అమెరికా రిటర్న్ గిఫ్టా
- హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లో చదువుతున్నా రద్దు
- భారత్ పై ఇండియా సాంస్కృతిక యుద్ధం?
- యూదు వ్యతిరేకత… పాలస్తీనియన్లకు మద్దతు వల్లేనా?
- సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు
సహనం వందే, వాషింగ్టన్:
ట్రంప్ విధానాలకు మద్దతు ఇస్తున్నందుకు అమెరికా ప్రభుత్వం మాత్రం భారతీయ విద్యార్థులను గెంటేస్తుంది. అమెరికా టారిఫ్ లపై అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇంతవరకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. చైనా వంటి దేశాలు బహిరంగంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుంటే… మనం మాత్రం సమర్థిస్తున్నాం. కానీ అమెరికా మాత్రం చైనా విద్యార్థులకు అనుకూలంగా… మనవాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఆ దేశం ఎఫ్-1 వీసాలను రద్దు చేసే కార్యక్రమం చేపట్టింది. అందులో 50 శాతం మన భారతీయ విద్యార్థులే ఉండటం శోచనీయం. చైనా విద్యార్థులు కేవలం 14 శాతం మాత్రమే ఉన్నారు.
షాకింగ్ గణాంకాలు…
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ నిర్వహించిన సర్వే దిగ్భ్రాంతికర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. రద్దయిన 327 వీసాల్లో దాదాపు 50 శాతం భారతీయ విద్యార్థులవే ఉండటం గమనార్హం. చైనా విద్యార్థుల వీసాలు కేవలం 14 శాతం రద్దు కాగా, మిగిలిన వారు దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల విద్యార్థులు. చిన్న చిన్న కారణాలతో, కొన్నిసార్లు అసలు కారణం చెప్పకుండానే వీసాలు రద్దు చేయడం విద్యార్థులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
భారతీయులు లక్ష్యం కాదని బుకాయింపు…
తమ విధానాలు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నామని అమెరికా పదేపదే చెబుతోంది. అయితే రద్దయిన వీసాల్లో సగం భారతీయ విద్యార్థులవే ఉండటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. “క్యాచ్ అండ్ రివోవల్” కార్యక్రమం పేరుతో, కృత్రిమ మేధస్సు సాయంతో సోషల్ మీడియా పోస్టులను నిఘా వేయడం, డేటా విశ్లేషణ చేయడం ద్వారా వీసాలు రద్దు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. యూదు వ్యతిరేకత లేదా పాలస్తీనియన్లకు మద్దతు ఇచ్చే పోస్టులు ఈ రద్దులకు కారణమని అంటున్నారు. కానీ ఈ ప్రక్రియలో ఎందుకు భారతీయ విద్యార్థులే ఎక్కువగా బలవుతున్నారు?
విద్యార్థుల భవిష్యత్తుపై కత్తి!
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత, ఇమిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరమయ్యాయి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ హోల్డర్లైనా, వర్క్ పర్మిట్లు కలిగిన విద్యార్థులైనా వీసాలు రద్దవుతున్నాయి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ హోల్డర్లైనా ఎఫ్-1 వీసాపై 12 నెలల పాటు అమెరికాలో పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ, చాలా మంది భారతీయ విద్యార్థులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల నుంచి తొలగింపు, వీసా రద్దు నోటీసులు విద్యార్థులను నిస్సహాయ స్థితికి నెట్టివేస్తున్నాయి. 57 శాతం మంది ఈ-మెయిల్ ద్వారా, 83 శాతం మంది యూనివర్సిటీల ద్వారా ఈ నోటీసులు అందుకున్నారని ఆ నివేదిక వెల్లడిస్తోంది. కొందరికి అసలు నోటిఫికేషన్ కూడా రాకుండా వీసాలు రద్దయ్యాయి.
సోషల్ మీడియాలో ఆగ్రహం…
ఈ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ‘అమెరికా వీసాల రద్దులో 50 శాతం భారతీయ విద్యార్థులే ఉండటం ఆందోళనకరం’ అని ఎక్స్లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ట్రంప్ విధానాలే ఈ రద్దులకు కారణమని కొందరు ఆరోపిస్తుండగా, భారతీయ విద్యార్థులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని మరికొందరు మండిపడుతున్నారు. “ఇది భారతీయ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే కుట్ర” అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. భారతీయ విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు ఈ అన్యాయంపై గట్టిగా నిలదీస్తున్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ రద్దుల బారిన పడటం గమనార్హం.
భారత ప్రభుత్వ మౌనం…
ఈ దారుణ గణాంకాల మధ్య భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆశ్చర్యకరం. విదేశాంగ మంత్రిత్వ శాఖ “ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని” చెప్పడం తప్ప, గట్టిగా స్పందించలేదు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలు విద్యార్థులకు సాయం చేస్తున్నాయని చెబుతున్నప్పటికీ, ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించడంలో చొరవ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. వెంటనే అమెరికాతో చర్చలు జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా, కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లేదు. భారతీయ విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇది సాంస్కృతిక యుద్ధమా?
ఈ వీసా రద్దుల వెనుక లోతైన రాజకీయ, సాంస్కృతిక కోణాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు విద్య, సాంకేతిక రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2023-24లో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతుండగా, వీరిలో 56 శాతం తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఈ విజయాలు కొందరికి కంటగింపుగా మారాయా? సోషల్ మీడియా నిఘా పేరుతో, భారతీయ విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేసే ప్రయత్నం జరుగుతోందా? ఈ రద్దులు కేవలం వీసా నిబంధనల అమలు కాదు, భారతీయ ప్రతిభను అణచివేసే కుట్రగా కనిపిస్తోందని పలువురు మండిపడుతున్నారు. భారత ప్రభుత్వం ఈ అన్యాయాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని విద్యార్థులు కోరుతున్నారు