- హిందువులు, ముస్లింల మధ్య జీవన విధానాల్లో తేడాలు
- పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు
సహనం వందే, ఇస్లామాబాద్:
హిందువులకు, ముస్లింలకు జీవన విధానంలో ప్రతి విషయంలోనూ వైరుధ్యం ఉందని, అనేక తేడాలు ఉన్నాయని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఏర్పడటానికి ఈ ద్విజాతి సిద్ధాంతమే ముఖ్య కారణమని ఆయన మరోసారి చెప్పారు. ఇస్లామాబాద్లో జరిగిన విదేశీ పాకిస్థానీయుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ మూలాలను గుర్తుంచుకోండి…
దేశ గుర్తింపును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ద్విజాతి సిద్ధాంతం గురించి తప్పకుండా నేర్పించాలని మునీర్ కోరారు. “పాకిస్థాన్ చరిత్రను మర్చిపోవద్దు. మీ తరువాత తరాల వారికి ఈ వివరాలు చెప్పండి. దానివల్ల వారికి పాకిస్థాన్తో ఉన్న బంధం ఎప్పటికీ బలహీనపడద”ని ఆయన పిలుపునిచ్చారు.
బలూచిస్థాన్లో ఉగ్రవాదాన్ని అణిచివేస్తాం…
అంతేకాకుండా బలూచిస్థాన్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేస్తామని మునీర్ చెప్పారు. “ఎంతమంది ఉగ్రవాదులు వచ్చినా బలూచిస్థాన్ను, పాకిస్థాన్ను ఏమీ చేయలేరు” అని ఆయన భరోసా ఇచ్చారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయుల దేశభక్తిని ఆయన మెచ్చుకున్నారు.
ద్విజాతి సిద్ధాంతమే వల్లే పాకిస్తాన్…
భారతదేశంలో ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలనే ఆలోచనతో ముస్లిం లీగ్ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం వల్లే పాకిస్థాన్ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. హిందువులు, ముస్లింల మధ్య ఉన్న తేడాల వల్లే ప్రత్యేక దేశం ఏర్పడాల్సి వచ్చిందని ఆయన నొక్కి చెప్పారు