సిజేరియన్ డెలివరీలపై కఠిన చర్యలు

సరియైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సి-సెక్షన్ ఆడిట్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి అన్నారు. సాధారణ కాన్పుల వల్ల కలిగే లాభాలను, సిజేరియన్ వల్ల జరిగే నష్టాలను గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు యాంటీ నాటల్ చెకప్ సమయంలోనే వివరించాలని సూచించారు. సాధారణ కాన్పుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు.

మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆసుపత్రులలో గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ఆసుపత్రులలో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన వార్డులలో ఏసీలు పనిచేసేలా చూడాలని చెప్పారు. ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. గత ఏడాది 8 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 6200లకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇందులో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ రాత పరీక్షలు పూర్తి కాగా, వెంటనే ఫలితాలు విడుదల చేసి, నెల రోజుల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందికి సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *