గూగుల్‌కు ఎదురుదెబ్బ

టెక్ దిగ్గజం గూగుల్ తన వెబ్ ప్రకటనల వ్యాపారంలో చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్య సామ్రాజ్యాన్ని నిర్మించిందని అమెరికా ఫెడరల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పు గూగుల్‌పై అమెరికా న్యాయశాఖ వేసిన యాంటీట్రస్ట్ కేసులో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణలో జడ్జి లియోనీ బ్రింకెమా గూగుల్ ఆన్‌లైన్ యాడ్ మార్కెట్‌లో పోటీని తగ్గించే విధంగా ప్రవర్తించిందని తెలిపారు. గూగుల్ ప్రకటనల టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లు పబ్లిషర్‌లకు, ప్రకటనదారులకు సరైన పరిస్థితులు కల్పించలేదని, దీనివల్ల మార్కెట్‌లో గూగుల్ ఆధిపత్యం పెరిగిందని కోర్టు గుర్తించింది.

గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ బలంతో డిజిటల్ ప్రకటనల మార్కెట్‌లో పోటీదారులను అడ్డుకుంది. ఈ విషయంలో గూగుల్ చేసిన పనులు చిన్న వ్యాపారాలకు, వినియోగదారులకు నష్టం కలిగించాయని న్యాయశాఖ వాదించింది. ఈ కేసు 2020లో మొదలైంది. గత సంవత్సరం ఆగస్టులో గూగుల్‌పై సెర్చ్ ఇంజిన్ గుత్తాధిపత్యానికి సంబంధించి మరో తీర్పు వచ్చిన తర్వాత ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

తీర్పు వెలువడిన తర్వాత గూగుల్ ఈ నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించాలని భావిస్తోంది. కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, “మా ప్రకటనలు టెక్నాలజీ పోటీని ప్రోత్సహిస్తాయి. వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది” అని అన్నారు. అయితే ఈ తీర్పు గూగుల్ వ్యాపార పద్ధతులపై పెద్ద ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసు రాబోయే రోజుల్లో టెక్ రంగంలో యాంటీట్రస్ట్ చర్యల గురించి మరింత చర్చకు దారితీయనుంది. గూగుల్‌పై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది టెక్ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *