- మతాలతో ముడిపెట్టొద్దని సుప్రీం కోర్టు స్పష్ఠీకరణ
- భాషలకు మత గుర్తింపు లేదని వెల్లడి
సహనం వందే, ఢిల్లీ:
హిందీ హిందువుల భాష, ఉర్దూ ముస్లింల భాష అనే భావనను సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ నమ్మకం వాస్తవ దూరం అని పేర్కొంటూ, భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగపడే సాధనమని, దానికి ఏ మతంతోనూ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం ఒక కేసు విచారణ సందర్భంగా చేశారు. భాషలను మతాలతో ముడిపెట్టడం వల్ల సమాజంలో చీలికలు వస్తాయని, భారతదేశం లాంటి భిన్న సంస్కృతులు కలిగిన దేశంలో ఇది అడ్డుగా నిలుస్తుందని కోర్టు అభిప్రాయపడింది. “హిందీ, ఉర్దూ లేదా మరే ఇతర భాష అయినా సరే, అవి మనుషుల మధ్య మాటలు కలపడానికి ఉద్దేశించినవి మాత్రమే, వాటికి ప్రత్యేకమైన మత గుర్తింపు ఏమీ లేదు” అని న్యాయమూర్తులు అన్నారు. ఈ తీర్పు భాషా రాజకీయాలు, మతపరమైన గుర్తింపుల గురించి జరుగుతున్న చర్చల్లో ఒక ముఖ్యమైన అంశంగా నిలవనుంది. భారతదేశంలో హిందీ, ఉర్దూతో పాటు అనేక భాషలను వేర్వేరు మతాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు మాట్లాడుతారని, వాటిని మతాలతో కలపడం వల్ల సమాజ ఐక్యతకు నష్టం జరుగుతుందని కోర్టు హెచ్చరించింది.