35 రకాల ఔషధాలపై నిషేధం

దేశవ్యాప్తంగా 35 రకాల ఔషధాల తయారీని నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలను కూడా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నొప్పి నివారణ, మధుమేహం వంటి వ్యాధులకు ఉపయోగించే అనుమతి లేని సుమారు 35 రకాల ఔషధాలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థ సూచనల మేరకు అనుమతి లేని ఔషధాలపై నిషేధం విధిస్తూ భారత ఔషధ నియంత్రక సంస్థ (డీసీజీఐ) లేఖ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది.

ఈ 35 రకాల ఔషధాలలో నొప్పి నివారిణులు, యాంటీబయోటిక్‌లు, మధుమేహం, అధిక రక్తపోటు, నరాల సంబంధిత ఔషధాలు, గర్భధారణ మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని సీడీఎస్‌సీఓ తెలిపింది. ఈ ఔషధాల తయారీని వెంటనే నిలిపివేయాలని, విక్రయాలను కూడా నిషేధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని ఔషధాలలో ఒకటి కంటే ఎక్కువ ఔషధ సమ్మేళనాలు (ఎఫ్‌డీసీ) ఉంటాయి. ఇలా ఒకే ఔషధంలో బహుళ సప్లిమెంట్లను కలపడం వల్ల వీటిని “కాంబినేషన్ ఔషధాలు” అని పిలుస్తారు. ఈ కాంబినేషన్ ఔషధాలు సరైన సురక్షిత ప్రమాణాలు, శాస్త్రీయ నిర్ధారణ లేకుండా ఉన్నాయని సీడీఎస్‌సీఓ గుర్తించింది.

సీడీఎస్‌సీఓ సూచనలతో డీసీజీఐ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆమోదం లేని ఎఫ్‌డీసీ ఔషధాల తయారీ, విక్రయాలను నిలిపివేయాలని లేఖ రాసింది. గతంలో ఈ ఔషధాలకు లైసెన్స్ ఇచ్చినప్పటికీ ప్రజల ఆరోగ్యం, ఔషధ సామర్థ్యంపై సమీక్షలు నిర్వహించి 35 ఆమోదం లేని ఎఫ్‌డీసీ ఔషధాల జాబితాను సిద్ధం చేసి, సంబంధిత కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. శాస్త్రీయ నిర్ధారణ లేని ఔషధాలు రోగుల ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉందని డీసీజీఐ తెలిపింది.

వాటిపై సామర్థ్య పరీక్షలు నిర్వహించకుండా కొన్ని రాష్ట్రాలు ఈ కాంబినేషన్ ఔషధాలకు అనుమతులు ఇచ్చాయి. ఈ ఔషధాలపై సమీక్షలు నిర్వహించి, వాటి సామర్థ్యాన్ని నిర్ధారించిన తర్వాతే వినియోగానికి అనుమతించాలని డీసీజీఐ సూచించింది. “ఈ ఔషధాలు ప్రజల ఆరోగ్యానికి, వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. ఇది అత్యవసర, తీవ్రమైన అంశంగా పరిగణించాల”ని డీసీజీఐ అధికారి రాజీవ్ సింగ్ రఘువంశీ హెచ్చరించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *