1248 నామినేషన్లు
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్కు భారీ స్పందన లభించింది. ఈ అవార్డుల ఎంపిక కోసం సినీనటి జయసుధ చైర్మన్గా జ్యూరీ సమావేశం బుధవారం హైదరాబాద్లోని ఎఫ్డిసి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్డిసి ఛైర్మన్ దిల్ రాజు జ్యూరీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని కోరారు. తెలుగు సినిమా రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జ్యూరీ సభ్యులు వ్యవహరించాలని ఆయన సూచించారు. నిష్ణాతులైన వారిని ప్రభుత్వం జ్యూరీ సభ్యులుగా నియమించిందని ఆయన తెలిపారు. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చలన చిత్ర అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత స్పందన రాలేదని దిల్ రాజు అన్నారు.
1248 నామినేషన్లు స్వీకరణ
జ్యూరీ సమావేశానికి అధ్యక్షత వహించిన సినీనటి జయసుధ మాట్లాడుతూ, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సవాలుగా తీసుకుని ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.హరీష్ మాట్లాడుతూ, సినీ నటి జయసుధ ఛైర్మన్గా 15 మందితో కూడిన జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. గద్దర్ అవార్డ్స్కు అన్ని కేటగిరీలకు కలిపి మొత్తం 1,248 నామినేషన్లు అందాయని ఆయన వెల్లడించారు. ఇందులో వ్యక్తిగత విభాగంలో 1172 నామినేషన్లు, చలన చిత్రాలు, బాలల చిత్రాలు, తొలి చిత్రాలు, డాక్యుమెంటరీలు/లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 21 నుండి స్క్రీనింగ్…
అందిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభమవుతుందని డాక్టర్ హరీష్ తెలిపారు. వివిధ కేటగిరీల ఎంట్రీల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి జ్యూరీ సభ్యులు సమావేశంలో చర్చించారు