నగర జీవితానికి స్వస్తి పలికి…

నగరంలోని ఉరుకులు పరుగుల జీవితానికి విసిగిపోయిన ఓ జంట.. పచ్చని పొలాల బాట పట్టారు. రసాయనాలు లేని సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లా, మెహమూద్‌పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర మాన్, ఆయన భార్య సర్లా మాన్.. పట్టణ జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

గతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)లో 11 ఏళ్ల పాటు పనిచేసిన జితేంద్ర.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాల్లో రెండు దశాబ్దాలు గడిపారు. అయితే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన మనసు మార్చుకున్నారు. 2018లో తమ పూర్వీకుల భూమిలో మునగ సాగును ప్రారంభించి, ‘హస్బెండ్ వైఫ్ ఫామ్’ పేరుతో ఒక బ్రాండ్‌ను స్థాపించారు. వారి కృషి ఫలితంగా 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్రాండ్ ఏకంగా రూ. 30 లక్షల టర్నోవర్‌ను సాధించింది.

జితేంద్ర, సర్లా దంపతులు కేవలం ఒక ఎకరం భూమిలో మునగ సాగు చేస్తూనే అద్భుతమైన ఆదాయం పొందుతున్నారు. 200 గ్రాముల మునగ పొడి ప్యాకెట్‌ను రూ. 650కి విక్రయిస్తూ నెలకు సుమారు రూ. 3.5 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు. ఒక్కో సీజన్‌లో ఎకరం నుంచి వారికి దాదాపు రూ. 10 లక్షల ఆదాయం వస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, ముంబై వంటి పెద్ద నగరాల్లో వీరి ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. నాణ్యత విషయంలో రాజీ పడకపోవడంతో వారి బ్రాండ్‌కు ఎంతో నమ్మకం ఏర్పడింది. “మా ఉత్పత్తుల ధర మార్కెట్‌లోని ఇతర బ్రాండ్‌ల కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ, మేము అందించే స్వచ్ఛమైన నాణ్యతే మమ్మల్ని మళ్లీ మళ్లీ కస్టమర్ల వద్దకు చేరుస్తుంది” అని సర్లా గర్వంగా చెబుతున్నారు.

ఈ జంట పూర్తిగా సేంద్రీయ పద్ధతులనే అనుసరిస్తోంది. దుక్కి దున్నకుండా సాగు చేయడం (నో-టిల్ ఫార్మింగ్), సోలార్‌తో నీటిని వినియోగించడం, వ్యర్థాలను తిరిగి కంపోస్ట్‌గా మార్చడం వంటి పద్ధతులతో సాగు చేస్తున్నారు. ఏడాదికి ఒక ఎకరం నుంచి దాదాపు 10,000 కిలోల మునగ ఆకులను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని ఎంతో జాగ్రత్తగా శుభ్రం చేసి నీడలో ఆరబెట్టి పొడి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో స్థానికంగా ఉండే 12 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్నారు.

నగర జీవితంలో జితేంద్ర అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులతో తీవ్రంగా బాధపడ్డారు. అయితే గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత, వారు సొంతంగా పండించిన మునగ ఉత్పత్తులను తీసుకోవడం మొదలుపెట్టాక ఆయన ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. “నేను ఇప్పుడు రోజూ మునగ తీసుకుంటాను. నా రక్తపోటు 120-130 మధ్య స్థిరంగా ఉంద”ని తన అనుభవాన్ని తెలిపారు.

ప్రస్తుతం వారి ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ వారి సరఫరా కంటే రెట్టింపు ఉంది. ఈ నేపథ్యంలో వారు తమ మునగ సాగును 4 ఎకరాల నుంచి 8 ఎకరాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోకి కూడా అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూఏఈలలో కొంతమంది కస్టమర్లు ఉండగా.. తమ బ్రాండ్‌ను మరింతగా విస్తరించాలని ఆశిస్తున్నారు.

తమ వ్యవసాయ ప్రయాణం గురించి జితేంద్ర, సర్లా మాట్లాడుతూ.. “గ్రామానికి తిరిగి రావడం మా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. ఇక్కడ మేము కష్టపడి పనిచేస్తూనే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నాము. కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణంలో జీవిస్తున్నాము” అని అన్నారు. వారి కథ ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ, స్థిరమైన, లాభదాయకమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి ఒక గొప్ప స్ఫూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *