యాదాద్రి జిల్లాలో వైద్యం అస్తవ్యస్తం

ప్రభుత్వం నుంచి నిధులు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన నిధులను కూడా వాడుకోకపోవడం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఆ జిల్లాకు వచ్చిన నిధుల్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడంతో అవి తిరిగి వెనక్కి పోయాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్ సీ), జిల్లా ఆసుపత్రుల్లో సమస్యలు తిష్ట వేశాయి. దీంతో రోగులకు సరైన వైద్యం చేయడానికి వీలు లేకుండా పోతుంది. కొన్ని సందర్భాల్లో వైద్య సిబ్బంది సొంత డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

గతేడాది ఆగస్టు 27న రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధి కోసం రూ. 15.30 కోట్లు విడుదలయ్యాయి. అందులో యాదాద్రి జిల్లాకు సీహెచ్‌సీల కోసం రూ. 18.01 లక్షలు, పీహెచ్‌సీల కోసం రూ. 25.86 లక్షలు వచ్చాయి. ఒక్కో పీహెచ్‌సీకి రూ. 1.23 లక్షలు, సీహెచ్‌సీ/జిల్లా ఆసుపత్రికి రూ. 4.50 లక్షలు కేటాయించారు. కానీ జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ డబ్బు వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో మరమ్మతులు చేయాలన్నా, ఏమైనా ఫర్నిచర్, పరికరాలు కొనాలన్నా వైద్యులే సొంత డబ్బులు పెట్టాల్సి వస్తోంది.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక్కో కేంద్రానికి రూ. 20 లక్షలు ఇచ్చింది. అయితే, వైద్యాధికారి డబ్బులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. కాంట్రాక్టర్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

పీహెచ్‌సీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం (నేషనల్ క్వాలిటీ అస్సూరన్ సర్టిఫికెట్ కింద) గత ఏడాది మార్చి 20న రూ. 2.40 కోట్లు మంజూరు చేశారు. ఒక్కో పీహెచ్‌సీకి రూ. 3 లక్షలు కేటాయించారు. ఈ డబ్బుతో ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందించవచ్చు. కానీ ఇప్పటి వరకు ఆయా ఆసుపత్రులకు పైసా కూడా విడుదల చేయలేదు. నిధులను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నిస్తే వేధిస్తున్నారని ఆసుపత్రుల వైద్యులు అంటున్నారు.

కుష్ఠు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వ్యాది నీ గుర్తించే కార్యక్రమం (ఎల్ సీడీసీ) కోసం రూ. 9.30 లక్షలు విడుదలయ్యాయి. వాటిని కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. కానీ వైద్యులను ముందుగా సొంత డబ్బులతోనే అన్నీ చేయాలనీ వైద్యాధికారి గూగుల్ మీట్ లో ఆదేశించి తర్వాత విడుదల చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు.

కంటి వెలుగు కార్యక్రమం జరిగి రెండేళ్లు దాటిపోయింది. కానీ అందుకు సంబంధించిన డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఒక్కో పీహెచ్‌సీకి రూ. 75,000 కంటే ఎక్కువ రావాల్సి ఉంది. కానీ వైద్యాధికారి పట్టించుకోవడం లేదు. ఈ విషయాలన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ‘డబ్బులు వెనక్కి వెళ్లిపోయాయి, నేనేమీ చేయలేన’ని కలెక్టర్ చేతులెత్తేశారని వైద్య సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని వైద్యులు, ప్రజలు కోరుతున్నారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *