ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం
సహనం వందే, ఖమ్మం:
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య (85) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య, తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేశారు. ఒంటరిగా కోటికి పైగా మొక్కలు నాటి, బీడు భూములను పచ్చని వనరులుగా మార్చారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2017లో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.
శోకసంద్రంలో ప్రకృతి ప్రేమికులు…
వనజీవి రామయ్య మరణ వార్తతో ప్రకృతి ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన చేసిన నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రామయ్యను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రకృతి ప్రేమికులు ఆయన స్వగ్రామానికి తరలి వస్తున్నారు. రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పర్యావరణానికి చేసిన కృషిని కొనియాడారు. రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వనజీవి రామయ్య మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి.