ఏకంగా 106 మంది సిబ్బందికి డిప్యూటేషన్లు
- డిప్యూటేషన్లు వద్దని మంత్రి చెప్పినా బేఖాతర్
- అధికారుల ఇష్టారాజ్యం…50 లక్షలు వసూలు
- భువనగిరి వైద్యశాఖలో అసంతృప్తి జ్వాలలు
- డీఎంహెచ్ఓపై ఉద్యోగుల తిరుగుబాటు
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదుకు సిద్ధం
సహనం వందే, హైదరాబాద్:
వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లపై మంత్రి దామోదర రాజనర్సింహ నిషేధం విధించినా, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం వైద్య మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మంత్రి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. తమకు ఎవరూ ఎదురులేదన్న ధోరణితో ఉన్నారు. మంత్రి ఆదేశాలకు విరుద్ధంగా, ఈ కాలంలో ఏకంగా 106 మందిని డిప్యూటేషన్ ద్వారా ఇష్టమైన చోటకు పంపించారు. నర్సింగ్ ఆఫీసర్లు మొదలు సీనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బందికి డిప్యూటేషన్లు ఇచ్చారు. సరాసరి ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేసినట్లు వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఇలా దాదాపు 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వైద్యులు ఆరోపిస్తున్నారు. ఒక పీహెచ్ సీ పరిధి నుంచి ఏకంగా 13 మందిని డిప్యూటేషన్ పై పంపించారంటే, దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా హైదరాబాద్ లోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం చూసిచూడనట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి.
వైద్య ఉద్యోగుల తిరుగుబాటు…
యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులపై వైద్య ఉద్యోగులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులు, విపత్కర సమయాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, పరిపాలనాపరమైన అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై జిల్లాలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు వారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తమ ఆవేదనను, డీఎంహెచ్ఓ నిరంకుశ వైఖరిని వివరిస్తూ ఉద్యోగులు ఒక సంయుక్త ఫిర్యాదు పత్రాన్ని రూపొందించారు.
మహిళా వైద్యాధికారులకు ఫోన్లు…
జిల్లాకు చెందిన వైద్య సిబ్బంది వైద్యాధికారులు అందరూ కలిసి మంత్రికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఫిర్యాదు పత్రంలో మహిళా వైద్యాధికారులకు పని వేళలు ముగిసిన తర్వాత కూడా ఫోన్లు చేసి వారి కదలికలను ఆరా తీయడం, సెలవులు పెడితే తీవ్రంగా విమర్శించడం వంటి చర్యలు వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా సెలవు రోజుల్లో సైతం బలవంతంగా గూగుల్ మీట్ సమావేశాలు ఏర్పాటు చేసి వీడియో ఆన్ చేయాలని సిబ్బందిని ఒత్తిడి చేయడం వంటి అంశాలను వారు వివరించారు. ఇది వృత్తిపరమైన హద్దులను అతిక్రమించడమే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లేలా డీఎంహెచ్ఓ వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడం, వాట్సాప్ సందేశాలను పట్టించుకోకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో అనుచితమైన భాషను ఉపయోగించడం, ఉద్యోగులను ప్రశ్నించకుండానే షోకాజ్ నోటీసులు జారీ చేయడం వంటి చర్యలతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
వ్యక్తిగత అవసరాలకు వాహనాల వినియోగం…
సెలవులు మంజూరు చేయకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకున్న వారి కుటుంబ సభ్యులపై నిందలు వేయడం వంటి చర్యలను కూడా ఫిర్యాదు పత్రంలో ప్రస్తావించారు. ఆర్థిక వ్యవహారాల్లోనూ డీఎంహెచ్ఓ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఆరోగ్య అభివృద్ధి నిధులు విడుదల కాకపోవడం, ఎన్హెచ్ఎం వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం వంటి అంశాలను కూడా ఉద్యోగులు తమ ఫిర్యాదు పత్రంలో చేర్చారు.
జిల్లా వైద్య శాఖలో నెలకొన్న ఈ పరిస్థితులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరనున్నారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ ఫిర్యాదు పత్రం త్వరలోనే ఆరోగ్యశాఖ మంత్రికి అందిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.