పేపర్ బ్యాలెట్లే మేలన్న అమెరికా నిఘా చీఫ్
సహనం వందే, వాషింగ్టన్:
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) హ్యాకర్లకు సులువుగా చిక్కుతాయని అమెరికా దేశీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ హెచ్చరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కాగితపు బ్యాలెట్లే సురక్షితమైన ఆమె అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక ముఖ్యమైన సమావేశంలో గబ్బార్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ మిషన్లలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని తమ కార్యాలయం సేకరించిన ఆధారాలను ఆమె సమావేశంలో అందజేశారు.”ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు చాలా కాలంగా హ్యాకర్ల గుప్పిట్లో ఉన్నాయని మాకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీని ద్వారా ఓట్ల ఫలితాలను మార్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి పేపర్ బ్యాలెట్లను వాడటమే మేలని తెలిసిందన్నా”రు. ఓటర్లు ఎన్నికలపై విశ్వసనీయత, నమ్మకం ఉండాలంటే పేపర్ బ్యాలెట్లు ఎంత ముఖ్యమో ఈ ఆధారాలు తెలియజేస్తున్నాయని ఆమె నొక్కి చెప్పారు.
ఇదిలా ఉండగా, 2020 ఎన్నికల సమయంలో సైబర్ భద్రతా అధికారిగా పనిచేసిన క్రిస్ క్రెబ్స్ చర్యలపై విచారణ జరపాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. గబ్బార్డ్ సమర్పించిన సమాచారం ప్రకారం, హ్యాకర్లు ఓటింగ్ మిషన్లలో చొరబడి ఓట్లను మార్చగలగడానికి వీలున్న తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు తేలింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఉన్న లోపాల కారణంగా ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని గబ్బార్డ్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, భద్రతపై ఓటర్లకు నమ్మకం కలిగించడానికి పేపర్ బ్యాలెట్ల వినియోగం చాలా అవసరమని ఆమె వాదించారు. ఈ వార్త భారతదేశంలో కూడా ఈవీఎంల భద్రతపై చర్చకు దారితీసింది. అయితే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపిన వివరాల ప్రకారం… భారతదేశంలో ఉపయోగించే ఈవీఎంలు ఇంటర్నెట్కు అనుసంధానం కావు. దీనివల్ల వాటిని హ్యాక్ చేయడం చాలా కష్టమని ఈసీఐ స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఉపయోగించే సంక్లిష్టమైన ఓటింగ్ వ్యవస్థలతో పోలిస్తే భారతీయ ఈవీఎంలు పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తాయని ఈసీఐ పేర్కొంది. తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో ఎన్నికల భద్రతపై ఒక కొత్త చర్చను మొదలుపెట్టాయి. పేపర్ బ్యాలెట్లకు మారడం వంటి మార్గాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ సంఘటన ఎన్నికల వ్యవస్థల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.