- డీఎంహెచ్ఓపై ఉద్యోగుల తిరుగుబాటు
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు సిద్ధం
- మహిళా ఉద్యోగులపై వేధింపులు
- నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు
సహనం వందే, భువనగిరి:
యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులపై వైద్య ఉద్యోగులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులు, విపత్కర సమయాల్లో డీఎంహెచ్ఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, పరిపాలనాపరమైన అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై జిల్లాలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు వారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తమ ఆవేదనను, డీఎంహెచ్ఓ నిరంకుశ వైఖరిని వివరిస్తూ ఉద్యోగులు ఒక సంయుక్త ఫిర్యాదు పత్రాన్ని రూపొందించారు.
మహిళా వైద్యాధికారులకు ఫోన్లు…
ఈ ఫిర్యాదు పత్రంలో మహిళా వైద్యాధికారులకు పని వేళలు ముగిసిన తర్వాత కూడా ఫోన్లు చేసి వారి కదలికలను ఆరా తీయడం, సెలవులు పెడితే తీవ్రంగా విమర్శించడం వంటి చర్యలు వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా సెలవు రోజుల్లో సైతం బలవంతంగా గూగుల్ మీట్ సమావేశాలు ఏర్పాటు చేసి వీడియో ఆన్ చేయాలని సిబ్బందిని ఒత్తిడి చేయడం వంటి అంశాలను వారు వివరించారు. ఇది వృత్తిపరమైన హద్దులను అతిక్రమించడమే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లేలా డీఎంహెచ్ఓ వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడం, వాట్సాప్ సందేశాలను పట్టించుకోకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు.
సిబ్బంది బదిలీల విషయంలో ఏకపక్షం…
సిబ్బంది బదిలీల విషయంలో డీఎంహెచ్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పారామెడికల్ సిబ్బందిని వారి అభిప్రాయాలు తీసుకోకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేయడం, వారి స్థానాల్లో కొత్త వారిని నియమించకపోవడం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. క్యాంప్ డ్యూటీల పేరుతో క్షేత్రస్థాయి సిబ్బందిని కార్యాలయాల్లో క్లర్కులుగా ఉపయోగించడంపై కూడా ఉద్యోగులు ప్రశ్నించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో అనుచితమైన భాషను ఉపయోగించడం, ఉద్యోగులను ప్రశ్నించకుండానే షోకాజ్ నోటీసులు జారీ చేయడం వంటి చర్యలతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
వ్యక్తిగత అవసరాలకు వాహనాల వినియోగం…
సెలవులు మంజూరు చేయకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకున్న వారి కుటుంబ సభ్యులపై నిందలు వేయడం వంటి చర్యలను కూడా ఫిర్యాదు పత్రంలో ప్రస్తావించారు. ఆర్థిక వ్యవహారాల్లోనూ డీఎంహెచ్ఓ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఆరోగ్య అభివృద్ధి సమితి నిధులు విడుదల కాకపోవడం, ఎన్హెచ్ఎం వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం వంటి అంశాలను కూడా ఉద్యోగులు తమ ఫిర్యాదు పత్రంలో చేర్చారు.
జిల్లా వైద్య శాఖలో నెలకొన్న ఈ పరిస్థితులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరనున్నారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ ఫిర్యాదు పత్రం త్వరలోనే ఆరోగ్య శాఖ మంత్రికి అందిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.