- ఇండియా నుంచి కార్గో విమానాల్లో తరలింపు
- ట్రంప్ సుంకాలను తప్పించుకునేందుకే
- లేకుంటే అమెరికాలో ఐఫోన్ల ధరలు రెట్టింపు
- చైనాపై 125% సుంకంతో ఇండియానే దిక్కు
- చైనా, భారతదేశాల్లోనే యాపిల్ ఫోన్ల తయారీ
- చైనాలోనే అత్యధికం… కానీ సుంకం భారం
- చెన్నైలో గతేడాది 2 కోట్ల ఐఫోన్ల తయారీ
సహనం వందే, హైదరాబాద్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త దిగుమతి సుంకాలను తప్పించుకోవడానికి టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. సుమారు 600 టన్నుల యాపిల్ ఐఫోన్లను భారతదేశం నుంచి నేరుగా అమెరికాకు కార్గో విమానాల్లో తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది దాదాపు 15 లక్షల యాపిల్ ఐఫోన్లని అంచనా. ట్రంప్ సుంకం వల్ల అమెరికాలో యాపిల్ ఐఫోన్ ధరలు పెరిగే పరిస్థితిని నివారించడానికి తోడ్పడుతుంది. అలాగే యాపిల్ ఉత్పత్తిలో భారతదేశం ప్రాముఖ్యత పెరుగుతోందని ఈ చర్య స్పష్టం చేస్తోంది.
చైనా సుంకానికి చెక్… భారతే దిక్కు
చైనా నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం దిగుమతి సుంకాలను భారీగా అంటే 125 శాతానికి పెంచింది. దీంతో యాపిల్ సంస్థకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ప్రపంచంలో అత్యధికంగా యాపిల్ ఐఫోన్లు చైనాలోనే తయారవుతాయి. అయితే భారత్పై విధించిన 26 శాతం సుంకాన్ని తాత్కాలికంగా 90 రోజుల పాటు తగ్గించడంతో యాపిల్ ఇండియాను ఒక అవకాశంగా చూసుకుంది. దీంతో ఆగమేగాల మీద ఆరు పెద్ద కార్గో విమానాల్లో మొత్తం 600 టన్నుల యాపిల్ ఐఫోన్లను చెన్నైలోని ఫాక్స్కాన్ కర్మాగారం నుంచి అమెరికాకు తరలించారు. కొత్త సుంకాలు అమలులోకి వచ్చిన సమయంలోనే ఒక విమానం సరుకును చేరవేసినట్లు సమాచారం.
చెన్నై ఫ్యాక్టరీలో 2 కోట్ల ఐఫోన్ల ఉత్పత్తి…
ఈ భారీ రవాణా కోసం యాపిల్ చెన్నైలోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ఏకంగా 20 శాతం పెంచింది. సాధారణంగా ఆదివారం సెలవు ఉండే ఈ కర్మాగారంలో, ప్రత్యేకంగా అదనపు షిఫ్ట్లు ఏర్పాటు చేసి ఎక్కువ మంది కార్మికులను పనిలోకి తీసుకున్నారు. ఈ ఒక్క కర్మాగారమే గత ఏడాది 2 కోట్ల యాపిల్ ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. ఇందులో కొత్తగా విడుదలైన ఐఫోన్ 15, 16 మోడళ్లు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా యాపిల్కు పూర్తి సహకారం అందించింది. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీ సమయాన్ని 30 గంటల నుంచి కేవలం 6 గంటలకు తగ్గించే “గ్రీన్ కారిడార్”ను ఏర్పాటు చేసింది.
అమెరికాలో ధరల పెరుగుదలకు బ్రేక్…
ఈ చర్యతో అమెరికాలో యాపిల్ ఐఫోన్ ధరలు తక్షణమే పెరగకుండా యాపిల్ నిరోధించగలిగింది. లేకపోతే 54 శాతం సుంకం ప్రకారం ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర అక్కడ 1,599 డాలర్ల నుంచి దాదాపు 2,300 డాలర్లకు పెరిగేది. అయితే ఈ సుంకాలు దీర్ఘకాలంలో యాపిల్ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి యాపిల్ భారత్లో తన ఉత్పత్తిని విస్తరిస్తోంది. ఇప్పటికే ఫాక్స్కాన్, టాటా గ్రూప్తో కలిసి మూడు కర్మాగారాలను నిర్వహిస్తోంది. మరో రెండు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఏడాదికి 22 కోట్ల ఐఫోన్ల విక్రయం…
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల యాపిల్ ఐఫోన్లను విక్రయిస్తుంది. అమెరికాకు చేసే మొత్తం ఐఫోన్ దిగుమతుల్లో ఐదో వంతు ఇప్పుడు భారత్ నుంచే వస్తోందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ అంచనా వేసింది. ఈ పరిణామం భారత్ను యాపిల్ ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రంగా మార్చడమే కాకుండా, ట్రంప్ సుంకాల నేపథ్యంలో “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమానికి ఊతమిస్తోంది.