మహారాష్ట్రలో మరాఠీ భాషోద్యమం

  • ఇంగ్లీషులో ‘ఎక్స్‌క్యూజ్ మీ’ అన్నందుకు ఓ మహిళపై దాడి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • నాన్ మరాఠీలపై పెరుగుతున్న దాడులు
  • తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు
  • దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది వ్యతిరేకత

సహనం వందే, ముంబై:
మహారాష్ట్రలోని డోంబివలిలో ఇంగ్లీషు భాష మాట్లాడినందుకు తాజాగా ఇద్దరు మహిళలపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా భాషా వివాదాలపై కొత్త చర్చను రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశంలో భాషా ఉద్యమాలు తిరిగి ఊపందుకుంటున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. తమిళనాడులో హిందీ వ్యతిరేకత, మహారాష్ట్రలో నాన్-మరాఠీ వ్యతిరేక ఉద్యమాలు, దక్షిణ రాష్ట్రాల్లో ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు… ఎక్కడ చూసినా భాషా ప్రాముఖ్యత పెరుగుతోంది. గతంలో శివసేన నేత బాల్ థాకరే హిందీకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. ఇది హిందీ సినిమాలు, బాలీవుడ్ పరిశ్రమపై కూడా ప్రభావం చూపింది.

‘ఎక్స్‌క్యూజ్ మీ’ అన్నందుకే దౌర్జన్యం…
డోంబివలి వెస్ట్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువతులు టూ-వీలర్‌పై వెళుతూ రోడ్డుపై నిలబడి ఉన్న ముగ్గురు వ్యక్తులను “ఎక్స్‌క్యూజ్ మీ” అని ఇంగ్లీషులో పక్కకు తప్పుకోమని కోరారు. ఈ సాధారణ వినతికి ఆగ్రహించిన ఆ ముగ్గురు వ్యక్తులు, “ఇక్కడ ఇంగ్లీషులో మాట్లాడొద్దు, మరాఠీలో మాట్లాడు” అంటూ వాగ్వాదానికి దిగారు. వివాదం కాస్తా దౌర్జన్యంగా మారి మహిళలపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ చిన్న పిల్లవాడిని చేతిలో పట్టుకుని ఉండగా దాడి జరిగినట్లు సాక్షులు తెలిపారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దేశంలో భాషా ఉద్యమాల పునరుజ్జీవనం…
భారతదేశంలో భాషా ఉద్యమాలు తిరిగి ఉద్ధృతమవుతున్నాయి. తమిళనాడులో హిందీ భాషను విధించడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. 1960లలో హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన ఈ రాష్ట్రంలో, ఇప్పుడు మళ్లీ తమ భాషా గుర్తింపును కాపాడుకునేందుకు ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అదే సమయంలో మహారాష్ట్రలో నాన్-మరాఠీ భాషలపై వ్యతిరేకత పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఉత్తర భారత ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తమ భాషా, సాంస్కృతిక ఉనికి కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డోంబివలి ఘటన దేశవ్యాప్త భాషా వివాదాలకు అద్దం పడుతోంది.

బాల్ ఠాక్రే హిందీ వ్యతిరేక పోరాటం…
మహారాష్ట్రలో భాషా వివాదాలకు శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే నేతృత్వం పునాది వేశారు. 1966లో శివసేన స్థాపన తర్వాత మరాఠీ గుర్తింపును కాపాడేందుకు ఆయన దక్షిణ భారతీయులు, గుజరాతీలపై దాడులు చేయడంతో పాటు హిందీ భాషకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేపట్టారు. 1968లో హిందీ సినిమాలను నిషేధించాలని ఆదేశించారు. ఈ చర్యలో భాగంగా శివసేన కార్యకర్తలు ముంబైలోని 17 సినిమా థియేటర్లపై దాడులు చేసి హిందీ సినిమాల ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ సంఘటనలు హిందీ సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపాయి. అప్పటి బాలీవుడ్ పరిశ్రమ శివసేన బెదిరింపులకు లొంగి బాల్ ఠాక్రేను శాంతింపచేయడానికి ప్రయత్నించింది. ఉదాహరణకు, ‘దో కలియాన్’ సినిమా నిర్మాత ఏవీ మీయప్పన్ ఠాక్రేను కలిసి అనుమతి కోరవలసి వచ్చింది. అయితే, ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం ఎక్కువ కాలం కొనసాగలేదు, ఎందుకంటే బాలీవుడ్ పరిశ్రమ ముంబైలో బలమైన ఆర్థిక శక్తిగా ఉండటంతో శివసేన తర్వాత కాలంలో దానితో సఖ్యత కొనసాగించింది. 1970ల తర్వాత బాల్ ఠాక్రే హిందీ సినిమాలపై దాడుల కంటే మరాఠీ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయడంపై దృష్టి పెట్టారు. ఉదాహరణకు, మరాఠీ చిత్రం ‘సోంగడ్యా’ను ప్రదర్శించేందుకు థియేటర్లను బలవంతంగా తెరిపించారు. అయినప్పటికీ, ఈ ఘటనలు బాలీవుడ్‌పై శివసేన ప్రభావాన్ని చూపాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది వ్యతిరేకత…
దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. తమిళనాడులో హిందీ బోధనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతుండగా, కర్ణాటకలో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా తెలుగు భాషా గుర్తింపును కాపాడుకునేందుకు కృషి జరుగుతోంది. “ఉత్తర భారత ఆధిపత్యం మా సంస్కృతిని నాశనం చేస్తోంది” అని దక్షిణాది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భాషా వివాదాలతో రాజకీయ లబ్ధి…
మహారాష్ట్రలో శివసేన గతంలో భాషా ఉద్యమాలను రాజకీయ లబ్ధికి వాడుకుంది. హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఆరంభంలో బాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, తర్వాత కాలంలో శివసేన బాలీవుడ్‌తో సంబంధాలను మెరుగుపరచుకుంది. ప్రస్తుతం రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కూడా ఇదే బాటలో నడుస్తోంది. “భాషా వివాదాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు సాధనాలుగా మారాయి” అని సామాజిక విశ్లేషకుడు రమేష్ అన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *