భారత్‌తో మైత్రికి చైనా తహ తహ

  • అమెరికాను ఎదుర్కునేందుకు వ్యూహం
  • ఆచితూచి అడుగులు వేస్తున్న ఇండియా
  • అమెరికా సుంకాల దెబ్బకు చైనా కౌంటర్
  • ట్రంప్ కు దిమ్మ తిరిగేలా సుంకాలు పెంపు

సహనం వందే, ఢిల్లీ:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల దెబ్బకు చైనా కౌంటర్ ఎటాక్‌తో స్పందించింది. ఈ వాణిజ్య యుద్ధంలో అమెరికా టారిఫ్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు చైనా భారత్ వైపు దృష్టి సారించి, మైత్రి బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవైపు అమెరికా దిగుమతులపై సుంకాలను 34 శాతం నుంచి భారీగా 84 శాతానికి పెంచి ట్రంప్‌కు షాక్ ఇచ్చిన చైనా, మరోవైపు భారత్‌తో కలిసి నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

అమెరికా ఒత్తిడిని తిప్పికొట్టే ప్రయత్నం…
చైనా భారత్‌తో మైత్రి బంధం కోసం చేస్తున్న ప్రయత్నాలు తీవ్రమవుతున్నాయి. భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్, “అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు చైనా-భారత్ కలిసి నిలబడాలి. మన ఆర్థిక సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయ”ని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ట్రంప్ చైనాపై 104 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో, ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు భారత్‌ను తమ వైపు తిప్పుకోవాలని చైనా భావిస్తోంది. “వాణిజ్య యుద్ధాలు ఎవరికీ లాభం చేకూర్చవు. ఏకపక్ష వాదాన్ని వ్యతిరేకిద్దాం” అని యు జింగ్ పిలుపునిచ్చారు. అయితే, భారత్ ఈ ప్రతిపాదనపై ఇంకా స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. అమెరికాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే, చైనాతో సరిహద్దు వివాదాల కారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. చైనా ప్రతిపాదనను భారత్ ఎంతవరకు స్వీకరిస్తుందనేది సందిగ్ధంగానే ఉంది. చైనాతో సుదీర్ఘకాలంగా ఉన్న శత్రుత్వాన్ని ఇండియా మరిచిపోలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో భారత్ కు వ్యతిరేకంగా చైనా చేస్తున్న కవ్వింపు చర్యలను మన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది.

ఉధృతం అవుతున్న వాణిజ్య యుద్ధం…
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. ట్రంప్ చైనా ఉత్పత్తులపై 104 శాతం సుంకాలు విధించడంతో, చైనా ప్రతీకార చర్యగా అమెరికా దిగుమతులపై సుంకాలను 34 శాతం నుంచి 84 శాతానికి భారీగా పెంచింది. ఈ “టిట్‌-ఫర్‌-టాట్” విధానం టంప్‌కు ఊహించని ఎదురుదెబ్బగా మారింది. ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని, అమెరికా వినియోగదారులు, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ఈ ఘర్షణ ఇరు దేశాలకూ నష్టం కలిగిస్తుంది” అని ఆర్థిక విశ్లేషకుడు రాజీవ్ శర్మ అభిప్రాయపడ్డారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *