- ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ఛాంపియన్ గా రేవంత్
- ఢిల్లీ వెళ్లి బీసీ రిజర్వేషన్ల ధర్నాలో సీఎం
- అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని కవిత దీక్ష
- నడిబజార్లో బహుజన ఆత్మగౌరవం అమ్మకం
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో రెడ్డి రిపబ్లిక్ రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ, కాపు వర్గాలే రాజ్యమేలుతున్నాయి. కేవలం 15% గా ఉన్న అగ్రకులాలు 85% ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తున్నాయి. రాజకీయ అధికారం మొదలు… సమస్త సంపద వారి చేతుల్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను తమ గుప్పెట్లో పెట్టుకుని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకొని రాజ్యాధికారం చలాయిస్తున్నారు. రాజ్యాధికారం కోసం పోరాడాలని అంబేద్కర్, కాన్షీరాం, జ్యోతిరావు పూలే వంటి మహనీయులు బహుజనులకు పిలిపిస్తే… తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు బహుజన ఉద్యమాన్ని అగ్రకులాల కాళ్ళ కింద పెట్టారు. కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం బహుజన ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 11న మహాత్మ జ్యోతిభా పూలే జయంతి, 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని వారు పిలుపునిస్తున్నారు.
బహుజన ముసుగులో ఓట్ల దోపిడీ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన సొంత కోటగా మార్చుకుని, కీలక పదవుల్లో తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపు పేరుతో బీసీ, ఎస్సీల ఓట్లను కొల్లగొట్టేందుకు ఆయన బహుజనుల రక్షకుడి ముసుగు వేసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో బీసీ గర్జన సభలో గొప్పగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో మాత్రం ‘రెడ్డి రిపబ్లిక్‘ను నడుపుతూ బహుజనులను మోసం చేస్తున్నారని వారు దుయ్యబడుతున్నారు.
కవిత దీక్ష… అగ్రకుల డ్రామాలో పూలే బొమ్మ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం కోసం మంగళవారం ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేయడం ద్వారా బహుజన వర్గాల దష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వెలమ కులం నేపథ్యం ఉన్న ఆమె బహుజన ఆకాంక్షలను కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా, అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించే ధైర్యం ఈ నాయకులకు లేదని మేధావులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఫూలే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందని బహుజన ప్రజలు నిలదీస్తున్నారు.
చెంచా నేతల దుర్గతి…
బహుజన ఉద్యమాన్ని తమ స్వార్థానికి అడ్డుగా పెట్టుకుని, అగ్రకులాల తొత్తులుగా మారిన కొందరు నేతలు అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కారని విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ పేరుతో కాంగ్రెస్, టీడీపీలతో ఓ నేత బేరసారాలు నడిపారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డికి ఓ బీసీ నేత తొత్తుగా మారారని, రాజ్యసభ సీటు కోసం మరో బీసీ నేత టిడిపి, వైసిపి, బిజెపితో లాబీయింగ్ చేసి బీసీలను బజారుకు లాగారని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాయకులు బహుజనుల ఆత్మగౌరవాన్ని కాలరాసి, వారిని బానిసలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంబేద్కర్ హెచ్చరిక నిజమైందా?
అంబేద్కర్, కాన్షీరాం వంటి మహనీయులు హెచ్చరించినట్లుగానే, నేటి బహుజన నాయకులు అగ్రకులాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి, 85 శాతం ఉన్న బడుగు వర్గాలను కేవలం 15 శాతం ఉన్న అగ్రకులాలపై ఆధారపడేలా చేశారని విమర్శకులు అంటున్నారు. రాజ్యాధికారం కోసం పోరాడకుండా చిన్న పదవులు… రిజర్వేషన్ల కోసం ప్రాధేయపడుతున్న ఈ నాయకుల తీరు చూస్తుంటే, బహుజనులకు సరైన నాయకత్వం కరువైందని స్పష్టమవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే బహుజనులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని వారు పిలుపునిస్తున్నారు.
బహుజనులు లేవండి…
ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి, కవిత వంటి అగ్రకుల నాయకుల చేతుల్లో బహుజన ఉద్యమం ఒక ఆటబొమ్మలా మారడాన్ని బహుజనులు తీవ్రంగా ఖండించాలి. స్వతంత్ర శక్తిగా ఎదిగి, తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఇది. మేకలకు పులి కాపలా కాస్తే వాటికి రక్షణ ఉండదని గ్రహించి, ఈ రాజకీయ క్రీడను బహిష్కరించి, అంబేద్కర్ ఆశయాలను నిజం చేసేందుకు బహుజనులు ఐక్యంగా ముందుకు సాగాలని మేధావులు పిలుపునిస్తున్నారు.